Two Love Couples Commited Suicide

Two Love Couples Commited Suicide

మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే ఘోరం.. ప్రేమించిన వ్యక్తిని కాదని..

ప్రకాశం జిల్లాలో రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రేమించిన యువతికి తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం చేస్తున్నారన్న కారణంగా ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోగా, వివాహమై కాపురాలు చేసుకుంటున్న ఇద్దరు మధ్య వయస్కులు తమ ప్రేమను సమాజం అర్దం చేసుకోలేదన్న కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. దీంతో నాలుగు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి

పెళ్ళింట విషాదం

మరికొన్ని గంటల్లో పెళ్లి బాజాలు మొగాల్సిన ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏఫ్రిల్ 21 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వివాహం జరగాల్సిన యువతి, ప్రేమించిన యువకుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పిచ్చిగుంట్లపల్లిలో శివారులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారు వెంకట నాగేశ్వరి అదే గ్రామానికి చెందిన వాలంటీర్‌ జక్కుల గోపి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలియక యువతి నాగేశ్వరి తల్లిండ్రులు మరో యువకుడితో పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. దీంతో ఆ పెళ్లి ఇష్టం లేక ప్రేమించిన వాలంటీర్‌ గోపీతో శనివారం ఇంటి నుంచి వెళ్ళిపోయింది నాగేశ్వరి. అదేరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఊరు శివారులో ఇద్దరూ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పెళ్ళింట విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అనైతిక బంధానికి అడ్డువస్తున్నారని మరో జంట..

అక్రమ సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని మిగిల్చిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చింతగుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దారవీడు మండలంలోని పుచ్చకాయలపల్లికి గ్రామానికి చెందిన వివాహిత కొమ్ముసాని విజయలక్ష్మి (40) కి అదే గ్రామానికి చెందిన అవివాహితుడు పోతిరెడ్డి సత్యనారాయణరెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరి అనైతిక బందం బయటపడడంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దమనుషులు ఇద్దరినీ పద్ధతి మార్చుకోవాలని మందలించారు. పెద్దల మాటలను పెడచెవిన పెట్టిన ఇద్దరూ తమ వివాహేతర సంబంధాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తూ వచ్చారు.

అయితే ఇటీవల వారం రోజుల నుంచి ఇరువురి కుటుంబాల్లో ఈ విషయమై గొడవలు మొదలయ్యాయి. దీంతో విజయలక్ష్మి, సత్యనారాయణరెడ్డిలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇద్దరూ గత శుక్రవారం ఇంట్లో నుంచి బయటికి వచ్చి చింతకుంట్ల గ్రామ శివారులో పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరుసటి రోజు శనివారం అటువైపుగా పొలానికి వెళ్లే రైతులు ఓ జంట విగతా జీవులుగా పడి ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మార్కాపురం గ్రామీణ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతులు వివాహేతర సంబంధం పెట్టుకున్న పుచ్చకాయలపల్లికి చెందిన విజయలక్ష్మి, సత్యనారాయణరెడ్డిలుగా గుర్తించారు పోలీసులు. మృతురాలు విజయలక్ష్మికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు సత్యనారాయణరెడ్డికి ఇంకా వివాహం కాలేదు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి