శోభన.. ఇప్పటి జనరేషన్కు ఈవిడ గురించి పెద్దగా తెలియదు కానీ.. ఓ మూడు దశాబ్దాల కిందకి వెళ్తే సౌత్ నాట ఈమె సంచలనం. దక్షిణాదిన స్టార్ హీరోలందరితో కలిసి ఈవిడ సినిమాలు చేసింది. అప్పట్లో చాలా మంది హీరోలు.. తమ సినిమాల్లో హీరోయిన్లుగా శోభన అయితే బావుండు అనుకునే వారంట.. అయితే ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఆమె ప్రేమ, పెళ్లికి దూరంగానే ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభన తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించింది.
నటి శోభన.. మార్చి 21, 1970న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. 1980లో శ్రీకాంత్, కెఆర్ విజయ నటించిన మంగళ నాయకి చిత్రంతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. మలయాళ చలనచిత్ర ప్రపంచం ద్వారా కథానాయికగా పరిచయమైన నటి శోభన 1984లో నటుడు కమల్హాసన్ కథానాయకుడిగా ఎస్బి ముత్తురామన్ దర్శకత్వంలో తెరకెక్కిన మదుల్ ఒరువన్ చిత్రంతో కథానాయికగా మారింది. ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

తెలుగులో అనేక సినిమాల్లో నటించిన శోభనకు ఇప్పటికీ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. తెలుగు, కన్నడ, హిందీ వంటి 200 కి పైగా చిత్రాలలో నటించారు శోభన. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు శోభన. 2006లో సినీరంగంలో ఆమె చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక ఇప్పుడు పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో ఆమెకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే శోభనకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభన పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను అడగ్గా.. తనకు పెళ్లిపై నమ్మకం లేకనే వివాహం చేసుకోలేదని.. పెళ్లి చేసుకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ పోతుందని తెలిపింది.