ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆయన మొబైల్లో ఓ మహిళ ఫోటోలు గుర్తించినట్టు సమాచారం. ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసుల నుంచి ఈ కేసు విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇక ఇంటరాగేషన్లో గురుమూర్తి సమాధానాలు విని పోలీసులు విసిగెత్తిపోతున్నారు. పూటకో వర్షన్ వారితో చెబుతున్నాడు. మరోవైపు మాధవి మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఆతర్వాత గురుమూర్తిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు.
గురుమూర్తి కొన్నాళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె గురుమూర్తికి సమీప బంధువవు. ఈ విషయం భార్యకు తెలియడంతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భార్యను అడ్డుతొలగించాలని భావించాడు. అదను కోసం ఎదురు చూశాడు. సంక్రాంతి సెలవులకు తన ఇద్దరు పిల్లల్ని సోదరి ఇంటికి పంపించాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయంపూట సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చారు. వేరే మహిళతో గురుమూర్తి ఉన్న కొన్ని ఫొటోలను ఆమె చూడటంతో 15న ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
అప్పటికే భార్యను హతమార్చాలనే పన్నాగంతో ఉన్న గురుమూర్తి… ఆమెను కిరాతకంగా చంపాడు. ఊపిరి పోయిందని నిర్ధారించుకున్నాక ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన ఒక వెబ్సిరీస్లో ఉన్నట్లుగానే… మృతదేహాన్ని బాత్రూమ్లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు. తర్వాత వాటిని బకెట్ నీళ్లలో వేసి హీటర్తో ఉడకబెట్టాడు. ముక్కలు మొత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. ఎముకలు, మాంసం ముద్దలను సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత రెండ్రోజులపాటు నిద్రలేకుండా ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేశాక గదిని శుభ్రం చేశాడు.
ఈనెల 16న సాయంత్రం భార్య కనిపించడం లేదని అత్తామామలకు ఫోన్లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేయించాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా మాధవి ఇంట్లోకి వెళ్లడం తప్ప బయటకు వచ్చిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో విషయం బయటపడింది. బుధ, గురువారాల్లో నిందితుడి నివాసంలో క్లూస్టీం, ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్తోపాటు ఇతర కీలక ఆనవాళ్లను సేకరించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయతే మృతదేహాన్ని ముద్దగా చేసి చెరువులో విసిరేసినట్లు నిందితుడు చెబుతున్నా ఇంకా ఆధారాలు లభించలేదు.