ఊర్వశి.. తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటించి తన అద్భుతమైన కామెడీ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించిన ఊర్వశి.. తన సినీ కెరియర్లో సుమారుగా 350కి పైగా చిత్రాలలో నటించి మెప్పించింది. అయితే ఊర్వశి చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను మొదలుపెట్టిన ఆమె.. క్రమంగా హీరోయిన్గా మారింది.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. మలయాళం సినిమాలకే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆమె విస్తృతంగా పనిచేసింది. ఇప్పటివరకు 350కు పైగా సినిమాల్లో నటించడం ఆమె కెరీర్లో గొప్ప మైలురాయి. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ..ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2000వ సంవత్సరంలో నటుడు మనోజ్ కె. జయన్ను ఆమె వివాహం చేసుకుంది.

ఈ దంపతులకు తేజ లక్ష్మి అనే కూతురు జన్మించింది. అయితే..వారి దాంపత్య జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. వ్యక్తిగత కారణాల వల్ల 2008లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరిగా గడిపిన ఊర్వశి, 2013లో చెన్నైకి చెందిన శివప్రసాద్ను రెండో వివాహం చేసుకుంది. ఈ వివాహం ద్వారా ఆమెకు స్థాపతి అనే కుమారుడు పుట్టాడు. శివప్రసాద్ ఇటీవలే దర్శకుడిగా మారారు. రెండో పెళ్లి తర్వాత.. ఆమె జీవితం కొంత స్థిరపడినట్టు ఆమె సన్నిహితులు చెబుతుంటారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో..తన మొదటి వివాహం ఎందుకు విఫలమైందో ఊర్వశి తొలిసారి బహిరంగంగా మాట్లాడింది. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం తనకు కొత్తగా.. కాస్త భయంగా అనిపించిందని చెప్పింది. ఇంట్లో అందరూ చాలా ఆధునిక జీవన విధానాన్ని అనుసరించేవారని, కలిసి తాగడం..తినడం సాధారణంగా జరిగేదని తెలిపింది.

తల్లీ..పిల్ల అన్న తేడా లేకుండా అందరూ ఒకేచోట కూర్చొని సిట్టింగ్ చేసేవారని గుర్తు చేసుకుంది. ఆ వాతావరణంలో తాను ఇమడగలుగుతానా లేదా అన్న సందేహం మొదట్లో చాలా వేధించిందని. ఊర్వశి చెప్పింది. అయినా సరే.. కుటుంబం కోసం తాను మారాలని ప్రయత్నించిందని తెలిపింది. వాళ్ల అలవాట్లకు అలవాటు పడేందుకు యత్నించిందని చెప్పింది. షూటింగ్లకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే తాగడం అలవాటుగా మారిందని వెల్లడించింది.
కాలక్రమంలో తాను తనను తానే కోల్పోతున్నాననే విషయం అర్థమైందని ఊర్వశి చెప్పింది. ఇంటి ఖర్చుల బాధ్యత ఎక్కువగా తన మీదే ఉండటంతో.. ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వచ్చిందని తెలిపింది. తన అభిప్రాయాలను ఎవరూ అర్థం చేసుకోలేదని, దాంతో ఇంట్లో గొడవలు జరిగేవని చెప్పింది.
