ధర్మపురి పట్టణానికి చెందిన రంగు గోపి అనే యువకుడు హోటల్ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి సొంతిల్లు లేకపోటవంతో పట్టణంలోని ఓ ఇంట్లో కుటుంబంతో కలిసి అద్దెకు ఉండేవాడు. అయితే ఇటీవల గోపి తీవ్ర అనారోగ్యానికి గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో వైద్యులు చేతులెత్తేశారు.
అయితే పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ధర్మపురికి తీసుకువచ్చారు. కాగా గోపికి సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటి యజమాని గోపి కుటుంబాన్ని అనుమతించలేదు. దీంతో గత్యంతరం లేక అతను బతికుండగానే స్మశానానికి తరలించి, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి సపర్యలు చేశారు.

స్మశానంలో వీరి దిన పరిస్థితి గమనించిన పట్టణంలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు స్పందించి సంఘ భవనంలోకి ఆ వ్యక్తిని, కుటుంబ సభ్యులను అక్కడికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన వంతు సాయంగా పదివేలు స్థానిక నాయకుల ద్వారా అందజేశారు. కాగా సొంత ఇల్లులేక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇలాంటి సంఘటనలు తరుచు జరుగుతున్నాయని అన్నారు. అద్దెకు ఉండే వ్యక్తులు చనిపోతే.. ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో.. నేరుగా స్మశాన వాటికకు తుసుకెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు తమ గోడు మంత్రికి విన్నవించుకున్నారు.