వీర్యదానం లేదా స్పెర్మ్ డోనేషన్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇప్పటికే ఇండియాలో చాలాచోట్ల స్పెర్మ్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని సంస్థలు స్పెర్మ్ డొనేషన్ చేసేవారికి నగదు కూడా చెల్లిస్తున్నాయి. ఎందుకంటే, ఈ స్పెర్మ్ బ్యాంకులు.. వీర్యాన్ని అమ్మేందుకు భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. స్పెర్మ్ డొనేషన్ పూర్తిగా చట్టబద్ధం. కాబట్టి, ఎవరైనా సరే స్పెర్మ్ డోనర్ కావచ్చు. దాన్ని ఉద్యోగంగా కూడా ఎంచుకోవచ్చు. అయితే సంతానం కోసం స్పెర్మ్ డోనర్ల సహాయం తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణం.
అయితే, యూరప్లో జరిగిన ఒక సంఘటన ఈ ప్రక్రియపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. తనకు తెలియకుండానే ఒక క్యాన్సర్ కారక జన్యు మార్పును కలిగి ఉన్న ఓ స్పెర్మ్ డోనర్ వల్ల, అతను తండ్రి అయిన 67 మంది పిల్లల్లో ఏకంగా 10 మందికి క్యాన్సర్ సోకినట్లు తాజాగా నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ డోనేషన్ నియంత్రణలపై, అలాగే జన్యు స్క్రీనింగ్ల ప్రాముఖ్యతపై తీవ్ర చర్చను రేపుతోంది. TP53 జన్యువులో మార్పు.. ప్రాణాంతక ప్రభావం.. ఈ కేసులో, సదరు స్పెర్మ్ డోనర్లో TP53 అనే జన్యువులో ఒక అరుదైన మ్యుటేషన్ (మార్పు) ఉన్నట్లు గుర్తించారు.
ఈ మ్యుటేషన్ లి-ఫ్రామిని సిండ్రోమ్ (Li-Fraumeni Syndrome) అనే జన్యుపరమైన రుగ్మతకు కారణమవుతుంది. ఈ సిండ్రోమ్ ఉన్నవారికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. ఈ డోనర్ నుంచి 2008 నుంచి 2015 మధ్య స్పెర్మ్ను సేకరించారు. ఆ సమయంలో అతను ఆరోగ్యంగానే ఉన్నాడు, ప్రస్తుత స్క్రీనింగ్ పద్ధతులు ఈ జన్యు మార్పును గుర్తించలేకపోయాయి. ఎనిమిది యూరోపియన్ దేశాలకు విస్తరించిన ప్రభావం..ఈ డోనర్ స్పెర్మ్ను డెన్మార్క్లోని ఒక ప్రముఖ స్పెర్మ్ బ్యాంక్ ద్వారా బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జెర్మనీ, గ్రీస్, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ వంటి ఎనిమిది యూరోపియన్ దేశాల్లోని కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ డోనర్ ద్వారా జన్మించిన 67 మంది పిల్లల్లో 10 మందికి ఇప్పటికే మెదడు కణితులు, లుకేమియా, హాడ్జికిన్ లింఫోమా, నాన్-హాడ్జికిన్ లింఫోమా వంటి తీవ్రమైన క్యాన్సర్లు నిర్ధారణ అయ్యాయి. అంతేకాదు, మరో 13 మంది పిల్లలు ఈ జన్యు మార్పును వారసత్వంగా పొందారని, వారికి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. నియంత్రణలు, భవిష్యత్ జాగ్రత్తలు.. ఒకే డోనర్ వీర్యాన్ని ఎంత మందికి వాడాలి అనే దానిపై సరైన నియంత్రణలు లేకపోవడం ఈ పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
దీనికి ముందు కూడా, ఒక డచ్ డోనర్ వీర్యం ద్వారా 500-600 మంది పిల్లలు పుట్టిన తర్వాతే అతని డోనేషన్ను నిలిపివేశారు. ఈ ఘటన జన్యు పరీక్షలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరాన్ని, అలాగే స్పెర్మ్ డోనేషన్పై కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తుంది. ఈ జన్యువును వారసత్వంగా పొందిన పిల్లలకు నిరంతర వైద్య పర్యవేక్షణ, తరచుగా స్క్రీనింగ్లు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సంఘటన సంతానోత్పత్తి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలను, నియంత్రణలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.