రంగనాథ్ జూలై 17, 1949 న మద్రాసులో జన్మించాడు. కుటుంబంలో ఎవరు సినీ నేపథ్యం ఉన్న వారు కాకపోవటంతో రంగనాథ్ బాల్యం అంతా సాధారణంగానే గడిచింది. తాతగారి ఇంట్లో పెరిగాడు. అయితే రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. 1974లో ‘చందన’ సినిమాతో రంగనాథ్కు హీరోగా అవకాశం లభించింది. అనంతరం దాదాపు 40 నుంచి 50 చిత్రాల్లో కథానాయకుడిగా చేశారు.
ఆ తర్వాత విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. దాదాపు దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. సీరియల్స్లో కూడా తన మార్క్ చూపించారు. 2015లో రంగనాథ్ ఊహించని రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్లోని తన ఇంట్లో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని జీవితాన్ని ముగించారు. రంగనాథ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు, కవితలతో ఎందరినో అలరించారు.

ఓ సినిమా కూడా డైరెక్ట్ చేశారు. అలాంటి రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రమాదవశాత్తూ భార్య మంచాన పడితే.. 15 ఏళ్ల పాటు ఆమెకు సపర్యలు చేశారు రంగనాథ్. 2009లో భార్య చైతన్య మృతి చెందడంతో ఆయన చాలా కుంగిపోయారని ఇండస్ట్రీలో చెబుతుంటారు. రంగనాథ్కు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు.రంగనాథ్ చనిపోయే ముందు ఆయన స్నేహితుడు, ‘నేటి నిజం’ ఎడిటర్ బైసా దేవదాసుకు ‘గుడ్ బై సార్’ అనే మేసేజ్ పంపారు.
అంతే కాదు ఆయన ఉరివేసుకున్న రూమ్లో ఓవైపు గోడపై ‘నా బీరువాలో ఆంధ్రాబ్యాంక్ బాండ్స్ ఉన్నాయి.. అవి పనిమనిషి మీనాక్షికి అప్పగించండి.. డోంట్ ట్రబుల్ హర్’ అని రాసి ఉంచారు. తనతో పాటు తన భార్యకు అన్నేళ్లపాటు పనిమనిషి మీనాక్షి చేసిన సేవ మర్చిపోకుండా ఆమెకు తగిన న్యాయం చేసేందుకు ఆయన అలా చేశారని చెబుతుంటారు.
