సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులోకి రావడంతో పోర్నోగ్రఫీ చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే ఆధునిక డిజిటల్ యుగంలో, సైబర్ మోసాల రకాలు మారుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త మోసపూరిత పద్ధతి ఏమిటంటే, పిల్లల అశ్లీల వీడియోలు చూస్తున్నారని లేదా మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్ కేసుల్లో పాల్గొన్నారని తప్పుడు ఆరోపణలతో వారు మిమ్మల్ని మోసం చేస్తారు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో ఎక్కువా పెరిగాయి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేరుతో వాట్సాప్లో ఒక లేఖ వచ్చింది! ఎల్బి నగర్కు చెందిన ఒక యువకుడికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేరుతో వాట్సాప్లో నకిలీ లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది.. “మీ ఐపీ చిరునామా ద్వారా మేము మిమ్మల్ని గుర్తించాము. పిల్లల అశ్లీల వీడియోలను చూసినందుకు సైబర్ ల్యాబ్లో కేసు నమోదు అయ్యింది. మీరు 24 గంటల్లో స్పందించకపోతే, ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటారు” అని హెచ్చరించింది.
ఈ సందేశాన్ని చూసిన తర్వాత ఆ యువకుడు భయపడ్డాడు, కానీ అతను ఈ విషయం నిజమా కాదా అనే ఆలోచించాడు. అలాంటి వీడియోలు చూడటం తనకు అలవాటు లేదని, అది నకిలీ ముఠాలు వ్యాప్తి చేసిన బూటకమని తెలుసుకున్నాడు. మరొక సంఘటనలో, నగరంలోని ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి కాల్ వచ్చింది. మీరు డ్రగ్ కేసులు, మనీలాండరింగ్లో ఉన్నారని, మాకు మీ ఆధార్ కార్డ్ నంబర్ అవసరమని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. భయంతో, అతను తన ఆధార్ నంబర్ ఇచ్చాడు.
తరువాత అతను పోర్న్ వీడియోలు చూస్తున్నాడని చూపించే డేటా తమ వద్ద ఉందని బెదిరించి రూ.1.5 లక్షలు వసూలు చేశారు. దీని తర్వాత, ఆ కాల్ నిజమైనదా కాదా అని అనుమానించి అతను పోలీసులను సంప్రదించాడు, కానీ అది పూర్తిగా మోసమని తేలింది. సైబర్ గ్యాంగ్లు మానసిక బలహీనతను చూపించే పరిస్థితులను క్రియేట్ చేస్తారు. బాధితులను వెంటనే స్పందించమని బలవంతం చేస్తాయి. అలాగే అవమానిస్తారు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తారు. తాము CBI, NCB, సైబర్ సెల్ అంటూ భయపెట్టి మోసం చేస్తారు. మీకు అలాంటి సందేశాలు లేదా ఫోన్ కాల్స్ వస్తే భయపడవద్దు.
పోలీసులు లేదా ప్రభుత్వ విభాగాలు నేరుగా వాట్సాప్లో మీకు సందేశాలు పంపించవు. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి. gov.in, .nic.in వంటి డొమైన్లతో ఇమెయిల్ వస్తేనే నమ్మండి. ఆధార్ నంబర్, OTP, పాస్వర్డ్ను ఎప్పుడూ షేర్ చేయవద్దు. మీరు అలాంటిదేదైనా చూసినట్లయితే, వెంటనే 1930 (సైబర్ హెల్ప్లైన్) లేదా https://cybercrime.gov.in వెబ్సైట్కు ఫిర్యాదు చేయండి అని పోలీసులు సూచిస్తున్నారు.
“భయంతో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. మోసగాళ్లను గుర్తించండి – సమాచారమే భద్రత! సైబర్ మోసానికి బలి కావడం నిరక్షరాస్యత వల్ల మాత్రమే కాదు, అవగాహన లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది.” అటువంటి అస్పష్టమైన పరిస్థితుల్లో తెలివిగా వ్యవహరించండి మరియు అధికారిక సమాచారం లేకుండా ఎటువంటి చర్య తీసుకోకండి.