పంత్..2022 డిసెంబర్ 30 రాత్రి నూతన సంవత్సరం వేడుకలు కోసం తన బీఎండబ్ల్యూ కారులో ఢిల్లీ నుంచి స్వగ్రామం రూర్కీ బయల్దేరాడు. నిద్రమత్తులో జాతీయ రహదారిపై ఓ టర్నింగ్ వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. వేగంగా దోసుకొచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టిన అనంతరం పల్టీలు కొట్టింది. అయితే తీవ్ర గాయాలతో కారులోంచి ఎలాగోలా బయటికొచ్చి.. కొన ఊపిరితో ఉన్న పంత్ను రజత్ అనే కుర్రాడు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రజత్ అప్పటికప్పుడు అలా సేవాభావంతో స్పందించడం వల్లే పంత్ ఈ రోజు ఇలా ఉన్నాడు.
లేదంటే.. తీవ్ర గాయాలతో ఉన్న అతను మరింత ఇబ్బందిపడేవాడు. వైద్యులు కూడా పంత్ను గోల్డెన్ అవర్లోనే ఆస్పత్రికి వచ్చాడంటూ పేర్కొన్నాడు. అంటే మరింత ఆలస్యమై ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని అర్థం. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకొచ్చిన రజత్ను వైద్యులు కూడా అభినందించారు. ఆ తర్వాత పంత్ కూడా రజత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. అయితే.. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రజత్ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
అది కూడా తన ప్రేయసితో కలిసి అతను సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో గల బుచ్చా బస్తీలో నివాసం ఉండే రజత్.. ప్రేమ పెళ్లికి తన తల్లిదండ్రులతో పాటు తన ప్రేయసి ఇంట్లో కూడా ఒప్పుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం బుచ్చా బస్తీలో తన లవర్తో కలిసి రజత్ పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం రజత్ పరిస్థితి విషమంగా ఉండగా, అతని ప్రేయసి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో రజత్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.