‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలో ‘పాకీజా’ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితులు. అలాంటి నటి ఇప్పుడు పూట గడవని దీనస్థితిలో కొన్నిసార్లు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమిళనాడులో ఆదరణ కరువవడంతో ఏపీ ప్రభుత్వం తనను ఆదుకుంటుందన్న ఆశతో ఇక్కడికి వచ్చారు. అయితే ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమె తాజాగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ వచ్చారు. ఈ క్రమంలోనే గుంటూరులో ఆమెను కొందరు మీడిాయ ప్రతినిధులు పలకరించగా..
తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు వాసుగి. తమిళనాడులో తనకు ఎవరూ సాయం చేయడం లేదని.. అందుకే ఏపీ ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కలిసి తన సమస్య చెప్పుకోవాలని ఉందన్నారు. ప్రస్తుతం తనకు పూట గడవడమే కష్టంగా ఉందని..కొన్నిసార్లు భిక్షాటన చేయాల్సి వస్తుందని.. తన గురించి వీడియో తీసి తమిళ పరిశ్రమలోని ప్రముఖులకు పంపినప్పటికీ ఎవరూ స్పందించలేదని అన్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు కుటుంబాలు స్పందించి తనను ఆదుకున్నారని.. ఒకవేళ వారు స్పందించకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తన గోడు వినిపించుకోవాలని ఉందని.. తనుక పింఛన్ సౌకర్యం కల్పిస్తే..వారి పేరు చెప్పుకుని బతుకుతానని అన్నారు. వాసుగి తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు.
అసెంబ్లీ రౌడీ, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారత్నం, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, బ్రహ్మ, పెదరాయుడు వంటి చిత్రాల్లో నటించారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. తమిళనాడు సీఎం జయలలిత ఆహ్వానంతో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా ఉన్న వాసుగి.. జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు.