2016 నవంబరు నెలలో రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో 2 వేల నోటును అప్పట్లో ప్రవేశపెట్టింది. అయితే రూ. 2 వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్టు ఆర్బీఐ 2023 మే 19న మొదటిసారి ప్రకటించింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. ఆర్బీఐ ప్రకటనతో జనం తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ. 2 వేల నోట్లు దాదాపు 99 శాతం వెనక్కి వచ్చాయి. ఇలా పెద్ద నోట్ల ఉపసంహరణకు ప్రధాన కారణం నకిలీ కరెన్సీ.
ప్రస్తుతం మార్కెట్లో పెద్ద నోట్లుగా ఉన్న 500 నోట్లకు నకిలీలు హల్ చల్ చేస్తున్నాయి. అందుకే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తం చేయడానికి నకిలీలను గుర్తించే సూచనలు చేస్తోంది. ఇప్పటికే 2,000 నోట్లు, 500 నోట్ల గురించి సూచనలు చేసిన ఆర్బీఐ ఇటీవల 200 రూపాయల నోట్ల గురించి సూచనలు చేసింది. ఎందుకంటే 200 రూపాయల నోట్లకు కూడా నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేశాయని వార్తలు వెలువడుతున్నాయి. వీటిని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 200 రూపాయల నోట్లకు కలర్ జిరాక్సులు తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 2000 నోటు ఉపసంహరణ తర్వాత నకిలీ 200, 500 నోట్లు పెరిగాయని RBI ప్రకటించింది.
జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రజలను హెచ్చరించింది. నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో తెలియజేస్తూ పలు ప్రకటనలు కూడా జారీ చేసింది. ఇటీవల నకిలీ 200 నోట్లు కూడా మార్కెట్ లోకి రావడంతో వీటిని రద్దు చేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు 200 నోటుకు ఉండే లక్షణాలను తెలియజేస్తూ ఆర్బీఐ ప్రకటన చేసింది. 200 నోటుపై గాంధీ బొమ్మ, ‘RBI’, ‘భారత్’, ‘ఇండియా’, ‘200’, అశోక స్తంభం గుర్తులు తప్పకుండా ఉండాలని, వీటిల్లో ఏది లేకపోయినా అది నకిలీ నోటని తెలిపింది. ఈ నేపథ్యంలో 200 నోట్లు వెనక్కు తీసుకొనే ఆలోచన ఏమీ లేదని కూడా తెలిపింది. నకిలీ నోట్లను అరికట్టడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నోట్లను జాగ్రత్తగా పరిశీలించాలని RBI సూచించింది.