విశాఖకు చెందిన సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్ వాసుపల్లి నాని అలియాస్ ‘లోకల్ బాయ్’ నానిని సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఓ యువకుడు డఫాబెట్, పారీమ్యాచ్, మహదేవ్బుక్, రాజాబెట్ వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల్లో ఇప్పటికే రూ.2 కోట్లు వరకు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. ఈ సమయంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చంటూ నాని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో వీడియో అప్లోడ్ చేశాడు. అయితే సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో లోకల్ బాయ్ నాని తన సొంత ప్రయోజనాల కోసం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. లోకల్ బాయ్ నాని ప్రమోషన్స్పై AYIF యూత్ వింగ్ విశాఖ సీపీ శంకబత్ర బాగ్చీకి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టి.. చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. నానిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. అయితే.. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి కొంత మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న కొందమంది యూట్యూబర్స్.. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ… యువతను తప్పుదారి పట్టిస్తున్నట్లు తేలింది. ఇప్పటికే చాలామంది యువకులు ఈ బెట్టింగ్ యాప్లలో నష్టపోయి సూసైడ్స్ చేసుకున్న ఘటనలు ఉన్నాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్గా ఫోకస్ పెట్టారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
ఎవరెవరు ఇప్పటివరకు ప్రమోట్ చేశారు.. అనే వివరాలను సేకరిస్తున్నారు. ఎవరైనా యూట్యూబర్లు ఇన్ఫ్లూయెన్సర్లు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆన్ లైన్ బెట్టింగ్లో పాల్గొనేటట్టు చేసే విధంగా ఎవరైనా వీడియోలు ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.