గత మూడు నాలుగేండ్లుగా దేశ, విదేశాలలో బైక్ రెడ్స్ చేస్తూ కంటెంట్ సృష్టిస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది ప్రజలకు చేరువయ్యాడు. ఈక్రమంలో తన ఛానల్లో కొన్ని ప్రమోషనల్ యాడ్స్ చేసి చిక్కుల్లో చిక్కుకున్నాడు. అయితే ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన అతనని ఎన్ఐఏ అధికారులు కాసేపటి క్రితమే చెన్నై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
యువతను పెడదోవ పట్టించేలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు మార్చి 22న భయ్యా సన్నీయాదవ్పై సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే అతను విదేశాల్లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అన్ని ఎయిర్పోర్టులలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా గత రెండు నెలలుగా సన్నీ యాదవ్ పాకిస్తాన్ లోనే ఉన్నాడు.

అంతేకాదు తన టూర్ వీడియోలు, బైక్ రైడింగ్ వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయడకూడదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
మరి ఇప్పుడు భయ్యా సన్నీయాదవ్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఇటీవలే పాకిస్తాన్లో బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేశాడు. ఈ క్రమంలోన ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు భయ్యా సన్నీ యాదవ్ను ఇవాళ చెన్నై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతనిని నేరుగా ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే భయ్యా సన్నీ యాదవ్ అరెస్టుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.