గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీపై విచారణ జరిపింది ఉన్నత విద్యా కమిషన్. విచారణ జరిపి నిజమేనని నిర్ధారించింది. అయితే ఏకంగా రూ.15 లక్షలు జరిమానా విధించింది. 2022-23 నుంచి 2024 సెప్టెంబర్ వరకు విద్యార్థుల నుంచి రూ.26.17 కోటర్లు అదనంగా వసూలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. ఈ మొత్తాన్ని విద్యార్ధులకు 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
ఈ మేరకు సెప్టెంబర్ 17న కమిషన్ ఆదేశాలు జారీ చేయగా.. ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. అంతేకాకుండా వరుస అవకతవకలకు పాల్పడుతున్న వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ సిఫార్సు చేసింది. మూడేళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి రూ 26.27 కోట్ల అదనంగా వసూలు చేశారని తల్లితండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ప్రత్యేక కమిటీ విచారణ అనంతరం ఉన్నత విద్యా కమిషన్ మోహన్ బాబు యూనివర్సిటీకి రూ. 15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ 26 కోట్లు 15 రోజుల్లో చెల్లించాలని విద్యా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గత నెల 17 న ఆదేశాలు జారీ చేసిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తమ వెబ్ సైట్ లో ఈ వివరాలను ఉంచింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై గతనెల 26న మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన హైకోర్టు మూడు వారాలపాటు తాత్కాలిక స్టే విధించింది. ఈనెల 14 న తదుపరి విచారణ జరగనుంది. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు నిర్ణయం సిఫార్సు వెనుక అసలు కథ ఇదీ…తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీవిద్యానికేతన్.. 2022 నుంచి మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లలో 70%, ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ కింద ప్రారంభించిన కోర్సుల్లోని 35% సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఈ సీట్లకు ఫీజులను నిర్ణయించే అధికారం ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ కు మాత్రమే ఉంటుంది. ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ నిర్ణయించిన దానికంటే అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని కమిషన్ తో పాటు విద్యాశాఖ మంత్రికి తల్లిదండ్రుల అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఎప్పుడూ ఉండని వారి నుంచి మెస్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.
దీనిపై స్పందించిన కమిషన్ ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సు మేరకు చర్యలకు ఉపక్రమించింది. దీంతో వర్సిటీ అనుమతి, గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీఏహెచ్పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సెల్కు కమిషన్ సిఫార్సు చేసింది.