ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒకవెలుగు వెలిగి చివరి రోజుల్లో ఎంత దుర్భర జీవితం గడిపిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.

divyaamedia@gmail.com
3 Min Read

మీనా కుమారి.. బాలీవుడ్ లో అత్యంత గొప్ప నటీమణిగా ఆమె పేరు గాంచింది. తన చిన్నతనం నుంచీ చనిపోయే దాకా ఆమె 30 ఏళ్ళ కెరీర్ లో దాదాపు 90 సినిమాల్లో నటించింది. ఆమె నటించిన వాటిలో ఎన్నో సినిమాలు క్లాసిక్ లుగా నిలవడం విశేషం. అయితే మీనా కుమారి అసలు పేరు మహజబీన్ బానో. 1933, ఆగస్టు 1న అలీ బక్స్, ఇక్బాల్ బేగం దంపతులకు జన్మించింది. అయితే, ఆడపిల్ల పుట్టిందని తండ్రి అలీ బక్స్‌కు ఏమాత్రం సంతోషం కలగలేదు. పైగా, హాస్పిటల్ ఫీజులు కూడా కట్టలేని దుస్థితిలో, మనసు చంపుకొని పసికందును ఓ అనాథాశ్రమంలో వదిలేశాడు. కానీ, కొన్ని గంటల్లోనే తప్పు తెలుసుకుని, పశ్చాత్తాపంతో తిరిగి వెళ్లి తన కూతురిని ఇంటికి తెచ్చుకున్నాడు.

కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండటంతో, కేవలం నాలుగేళ్ల వయసులోనే మహజబీన్‌ను సినిమాల్లోకి పంపించారు. విజయ్ భట్ దర్శకత్వంలో ‘లెదర్ ఫేస్’, ‘అధూరి కహానీ’, ‘పూజ’ వంటి చిత్రాల్లో చైల్డ్‌ఆర్టిస్ట్‌గా నటించింది. 1940లో ‘ఏక్ హి భూల్’ సినిమా విడుదలయ్యాక, విజయ్ భట్ ఆమెకు “బేబీ మీనా” అని పేరు పెట్టారు. 1946లో, ‘బచ్చోన్ కా ఖేల్’ సినిమాతో మొదటిసారి లీడ్ యాక్ట్రెస్‌గా నటించింది, అప్పటి నుంచి మీనా కుమారిగా స్థిరపడింది. రెండు దశాబ్దాల్లో, మీనా కుమారి అగ్రతారగా ఎదిగింది. ‘బైజు బావ్రా’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులాం’, ‘పరిణీత’, ‘దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయ్’, ‘ఫూల్ ఔర్ పత్తర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఆమె యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

ఈ తార కవయిత్రి, సింగర్, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. ఎమోషనల్ యాక్టింగ్‌తో ట్రాజెడీ క్వీన్‌గా బిరుదు తెచ్చుకుంది. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో 90కి పైగా సినిమాల్లో నటించింది. 1952లో, 18 ఏళ్ల మీనా కుమారి, అప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్న 34 ఏళ్ల ప్రముఖ దర్శకుడు కమల్ అమ్రోహిని పెళ్లాడింది. మొదట్లో బాలీవుడ్‌ క్యూట్ కపుల్‌గా వీరు అందరినీ ఆకట్టుకున్నారు. కానీ, వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొద్దిరోజుల్లోనే వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్త చేయి చేసుకోవడం, మానసికంగా వేధించడం, ప్రతీ విషయంలోనూ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూడటం.. ఇలాంటివి వారి దాంపత్యాన్ని నరకంలా మార్చేశాయి.

1964లో వారు విడిపోయారు. ఈ బాధను తట్టుకోలేక మీనా కుమారి మద్యానికి బానిసైంది. కమల్‌తో విడిపోయాక, మీనా యాక్టర్ ధర్మేంద్రతో సన్నిహితంగా మెలిగింది. ఆమె ధర్మేంద్రను ప్రేమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు, నిర్మాతలను ఒప్పించి ధర్మేంద్రకు అవకాశాలు ఇప్పించిందని, అతడి కెరీర్ ప్రారంభంలో ఎంతగానో సహాయపడిందని అంటారు. ఏళ్ల తరబడి మద్యం సేవించడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. 1968లో, ఆమెకు లివర్ సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స కోసం లండన్, స్విట్జర్లాండ్ వెళ్లగా ఆ ఖర్చులు ఆమె ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయి.

మరోవైపు, 1954లో కమల్‌తో మొదలుపెట్టిన ‘పాకీజా’ సినిమా 1969లో మళ్లీ పట్టాలెక్కింది. అనారోగ్యంతో బాధపడుతున్నా, మీనా ఆ సినిమాను పూర్తి చేసింది. 1972, ఫిబ్రవరి 4న ‘పాకీజా’ విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. కానీ, ఆ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే, కొద్ది వారాలకే, 1972, మార్చి 31న, కేవలం 38 ఏళ్ల వయసులో మీనా కుమారి తుదిశ్వాస విడిచింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *