ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. సౌద్ షకీల్ 62, మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశారు. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ని రోహిత్ శర్మ 20(15) తో మొదలు పెట్టగా, గిల్-కోహ్లీ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 46 వ్యక్తిగత పరుగుల వద్ద గిల్ అవుట్ అవ్వగా, శ్రేయాస్ తో కలిసి విరాట్ భారత్ కి విజయాన్ని అందించే దిశగా కొనసాగించారు.
అయితే ఎట్టకేలకు విజయానికి 2 పరుగులు, తన సెంచరీకి 4 పరుగులు అవసరమైన దశలో ముందుకొచ్చి, ఎక్స్ట్రా కవర్స్లోకి సూపర్ షాట్తో కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఈ సెంచరీ చేయడానికి ముందు, పాకిస్థాన్తో మ్యాచ్కి ఒక రోజు ముందు విరాట్ కోహ్లీ ఎంత కష్టపడ్డాడో తెలిస్తే అతని సెంచరీ విలువ అర్థం అవుతుంది. పాకిస్థాన్తో మ్యాచ్కి ముందు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో టీమిండియాకు ప్రాక్టీస్ సెషన్ ఉంది. ఆటగాళ్లంతా ఆ టైమ్కే అక్కడి వస్తారు. కానీ, విరాట్ కోహ్లీ మాత్రం.. ఓ ఐదున్నర గంట ముందే కొంతమంది సపోర్టింగ్ స్టాఫ్తో అక్కడి చేరుకొని నెట్స్లో ఒక్కడే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
4 గంటలకు టైమ్ ఇస్తే.. 10.30కే వెళ్లిపోయి ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇప్పటికే కొన్ని వేల పరుగుల, 81 అంతర్జాతీయ సెంచరీలు సాధించినా కూడా కోహ్లీ డెడికేషన్ ఏం రేంజ్లో ఉందో ఈ ఒక్క సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని మ్యాచ్ల్లో తన రేంజ్ బిగ్ స్కోర్ రాలేదనే కసి కూడా కోహ్లీలో ఉంది. అందుకే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఎలాగైనా సరే పెద్ద స్కోర్ చేయాలని, అందుకోసం తన బలహీనతలపై ముందు వర్క్ చేయాలని భావించి.. దాదాపు ఓ 7 గంటల పాటు నెట్స్లో చెమలు చిందించాడు.
దానికి ఫలితమే పాకిస్థాన్పై సెంచరీ, టీమిండియాకు ఈజీ విక్టరీ. గ్రౌండ్లో పాక్పై కోహ్లీ ఆటను, సెంచరీని అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే అది అందరికీ కనిపిస్తుంది. కానీ, దాని కోసం కోహ్లీ పడిన కష్టం మాత్రం అతనికొక్కడికే తెలుసు. అంత కష్టపడతాడు కాబట్టే ఇంత గొప్ప ప్లేయర్ అయ్యాడు. ఊరికే అయిపోతారా ఏంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు అంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్లు అంటున్నారు. పాక్పై సెంచరీతో వన్డేల్లో 51వ, ఓవర్గా 82వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కింగ్ కోహ్లీ.