పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన గునుపూడి విశ్వనాథ శాస్త్రి స్వతహాగా మంచి పేరున్న పురోహితుడు. గోదావరి జిల్లాకే చెందిన ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ స్థానికంగా ఓ శుభ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడికి పురోహితుడిగా వచ్చిన విశ్వనాథశాస్త్రిలోని హాస్య చతురతను గమనించిన ఆయన ‘అప్పుల అప్పారావు’ సినిమాతో కమెడియన్గా వెండితెరకు పరిచయం చేశారు. మొదటి సినిమాకే ఆయన మంచిపేరు రావడంతో పాటు ఐరన్ లెగ్ శాస్త్రిగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు.
అయితే సినీరంగంలోకి అడుగుపెట్టకముందు పౌరోహిత్యం చేస్తుండేవారు. ఐరన్ లెగ్ గా ఈవీవీ ఇమేజ్ క్రియేట్ చేశాక.. చిత్రసీమలో చాలాకాలం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హాస్య నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐరెన్ లెగ్ శాస్త్రి… ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అయితే చివరి రోజుల్లో మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో సినిమా అవకాశాలు లేకపోవడంతో పౌరోహిత్యం వైపు తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు తన స్క్రీన్ పై ఉన్న పేరు ఉపాధి కరువయ్యేలా చేసిందట.

గతంలో ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. సినిమాల్లో ఐరెన్ లెగ్ శాస్త్రిగా ఫేమస్ కావడంతో.. అదే పేరు నిజ జీవితంలో ఉపాధి కరువయ్యేలా చేసింది. దరిద్రానికి, దురదృష్టానికి సింబాలిక్ గా చూపించి నవ్వులు పూయించారు. ఆఖరి రోజుల్లో శాస్త్రి తన పౌరోహిత్యంతో చేసుకుని బతికేద్దామని అనుకుంటే.. ఐరెన్ లెగ్ పేరు వల్ల ఆయనను శుభకార్యాలకు పిలిచేవారు కాదట. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడ్డారు. ఐరెన్ లెగ్ శాస్త్రి మరణానికి సంబంధించిన విషయాలను ఆయన కుమారుడు ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘మా నాన్న ఐరెన్ లెగ్ శాస్త్రి చాలా సినిమాల్లో నటించినా పెద్దగా ఆస్తులు కూడబెట్టుకోలేకపోయారు. అవకాశాలు తగ్గడంతో హైదరాబాద్ నుంచి సొంతూరు తాడేపల్లిగూడెంకు వచ్చేశాం. మా కుటుంబం పౌరహిత్యంపై ఆధారపడటంతో కష్టంగా ఉండేది. నాన్న శరీరం భారీగా పెరిగిపోయింది. ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో మేమంతా హైదరాబాద్లో ఉండటంతో మా బంధువులు ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరుసటి రోజు ఉదయం మేం తాడేపల్లిగూడెం చేరుకుని హాస్పిటల్కు చేరుకునే సరికే ఆయన కన్నుమూశారు.
ఆస్పత్రి బయట రిక్షాలో ఆయన డెడ్బాడీని చూడగానే అమ్మ కళ్లు తిరిగి పడిపోయింది. నాన్న చనిపోయారన్న విషయం తెలియగానే సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు మా ఇంటికి వచ్చి తోచినంత సాయం చేశారు. నాన్న చనిపోయాకు మా కుటుంబమంతా చాలా కష్టాలు పడింది. మా మేనత్త మమ్మల్ని ఆదుకుని చదివించింది. మా ఆర్థిక పరిస్థితి తెలుసుకుని నటుడు కాదంబరి కిరణ్ సాయం చేశారు. ఆయన చేసిన సాయం వల్లే నేను సీఏ చదవగలిగాను. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.