కొంతమంది వైద్యులు గతంలో విడుదలైన బరువు తగ్గించే మందులు ఆశించినంత ప్రభావవంతంగా లేవని, కానీ ఈ ఇంజెక్షన్ మాత్రం బహుశా మెరుగైన ఫలితాలను ఇవ్వగలదని అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం, ఇంజెక్షన్ రూపంలో ఉండటం వల్ల శరీరంలో దీని శోషణ, ప్రభావం మరింత సమర్థవంతంగా ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ సానుకూల దృక్పథం, గతంలో బరువు తగ్గడానికి ప్రయత్నించి విఫలమైన వారికి ఒక కొత్త ఆశను చిగురింపజేస్తోంది.
అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఊబకాయం, అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి నానా తంటాలు పడుతుంటారు. కొందరు సులభంగా, వేగంగా సమస్య పరిష్కారం కోసం చూస్తుంటారు. దీని కారణంగానే మార్కెట్ కొవ్వు తగ్గించే మాత్రలు, సప్లిమెంట్లు, పౌడర్లు, ఇంజెక్షన్లు విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే భారతదేశ మార్కెట్లోకి అడుగుపెట్టింది అధిక బరువును తగ్గించే మందు.
డెన్మార్క్కు చెందిన నోవో నార్డిస్క్ అనే ఫార్మా కంపెనీ వెగోవీ అనే కొత్త మెడిసిన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోవో నార్డిస్క్ జూన్ 24న భారతదేశంలో బరువు తగ్గించే మందు వెగోవీని ప్రారంభించింది. నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మంగళవారం ఈ మెడిసిన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం ఈ మెడిసిన్ అన్ని అనుమతులతో అందుబాటులోకి వచ్చేసిందని చెప్పారు. ఈ నెలాఖరులోగా ఫార్మా దుకాణాల్లోనూ లభిస్తుందని చెప్పారు.
అధిక బరువుతో బాధపడుతూ, ఊబకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మందు మంచి ఫలితాలనిస్తుందని చెప్పారు. ఇక ఈ మందు వాడకం విషయానికి వస్తే.. ఈ మెడిసిన్ వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీని ధరలు డోసును బట్టి మారుతూ ఉంటాయని అన్నారు. 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ డోసుల ధర నెలకు రూ. 17,345 (వారానికి రూ. 4,366) ఉంటుంది. 1.7 ఎంజీ డోసుకు నెలకు రూ. 24,280; 2.4 ఎంజీ డోసుకు నెలకు రూ. 26,015 ఖర్చవుతుందని స్పష్టం చేశారు.