బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో కన్నడ నటి రన్యా రావ్ పేరు తెరపైకి వచ్చింది. రూ. 12.56 కోట్లు విలువైన బంగారంతో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. ఒక ఏడాదిలో 30 సార్లు దుబాయ్ నుంచి ప్రయాణించి, ప్రతిసారి కిలోల కొద్దీ బంగారం తీసుకురావడం జరిగినట్లు విచారణలో వెల్లడైంది. రన్యా రావ్ తన పలుకుబడి ఉపయోగించి విమానాశ్రయ అధికారుల తనిఖీలను తప్పించుకున్నట్లు చెబుతున్నారు. పోలీస్ సెక్యూరిటీని తప్పించుకునేందుకు వీఐపీ ఎయిర్పోర్ట్లో ఉన్న బైపాస్ దారి నుండి వెళ్లిపోయేది.
గడిచిన ఆరు నెలల వ్యవధిలో సుమారు 27 సార్లు దుబాయ్ కి ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ లో ఉన్న బంగారం సిండికేట్ వ్యాపారులతో రన్యారావ్కు మంచి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మార్చు 18 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. కోర్టును మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు డిఆర్ఐ అధికారులు. మరోవైపు కోర్టును ఆశ్రయించారు రన్యా రావ్. అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్తో ఆమె భర్త జితిన్ హుక్కేరికి ఏమైనా సంబంధం ఉందా అని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఆమె భర్త జితిన్ ఎవరు? ఆయన ఏం చేస్తుంటారు? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రన్యా రావును జితిన్ నాలుగు నెలల క్రితం తాజ్ వెస్ట్ ఎండ్లో గ్రాండ్గా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వారు బెంగళూరులోని అప్స్కేల్ లావెల్లె రోడ్లోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో కాపురం ఉంటున్నారు. హుక్కేరి వృత్తిరీత్యా ఒక ఆర్కిటెక్ట్, బెంగళూరులోని ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆయన లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ – ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నోవేషన్ స్పెషలైజేషన్తో ఉన్నత విద్యను అభ్యసించాడు. జతిన్ మొదట్లో బెంగళూరు రెస్టారెంట్ పరిశ్రమలో తన వినూత్న డిజైన్లతో తన మార్క్ను చూపించాడు. ఇండియాతో పాటు లండన్లోనూ పలు నిర్మాణాలకు డిజైన్లు ఇచ్చాడు.
జితిన్కు WDA & DECODE LLC, క్రాఫ్ట్ CoDe అనే కంపెనీలు ఉన్నాయి. హాస్పిటాలిటీ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో జితిన్కు మంచి అనుభవం ఉంది. బెంగళూరులోని హ్యాంగోవర్ అనే కాక్టెయిల్ బార్ అండ్ డైనర్ను జితినే డిజైన్ చేశాడు. బెంగళూరులో అతని క్లయింట్ పోర్ట్ఫోలియోలో బెంగళూరు XOOX, బ్రూమిల్, ఆలివ్ బీచ్ వంటివి ఉన్నాయి. అలాగే ఢిల్లీ, ముంబైలలో కూడా ప్రాజెక్టులు చేపట్టాడు. ఉన్నత విద్యలు అభ్యసించి, వృతి పరంగా మంచి పొజిషన్లోనే ఉన్న జితిన్కు ఈ గోల్డ్ స్మగ్లింగ్తో లింక్ ఉందా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.