వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్ ధరను రూ.24 మేర తగ్గించినట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. అయితే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.24 తగ్గింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నిర్ణయం మేరకు ఈ కొత్త ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.దేశంలో జూన్ 1 నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1723.50గా ఉంది. ఇది వరకు ఏప్రిల్లో కూడా ఈ సిలిండర్ ధర రూ.41 తగ్గించిన విషయం మనకి తెలిసిందే.
ఇక గృహ అవసరాలకు ఉపయోగించే సహజ వాయు (నేచురల్ గ్యాస్) ధర కూడా రెండేళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. జూన్ నెలకు ఇది ఒక్క మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mmbtu)కు $6.41కి పడిపోయింది. ఈ తగ్గుదల నగర వాయు సరఫరా సంస్థలకు, ధర నియంత్రిత ఇంధనాన్ని వినియోగించే ఇతర రంగాలకు ఊరటగా మారింది. పండ్లు, కూరగాయలు వంటి వస్తువుల రవాణా వ్యయాలు, వంటగ్యాస్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది – నగర గ్యాస్ పంపిణీ సంస్థలు ఈ తగ్గుదల ప్రయోజనాన్ని వినియోగదారులకు నేరుగా అందించనున్నారు.

ఇక, గృహ వాడుక సహజ వాయు ధరను (APM ప్రైస్ అని కూడా పిలుస్తారు) ప్రభుత్వం ప్రతి నెలా గడిచిన నెలలో క్రూడాయిల్ సగటు ధర ఆధారంగా నిర్ణయిస్తుంది. మే నెలలో క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో, జూన్ నెలకు గ్యాస్ ధర $6.93 నుంచి $6.41కి తగ్గింది. మేలో అమలులో ఉన్న గ్యాస్ గరిష్ట ధర $6.50గా ఉంది. 2023 ఏప్రిల్లో కొత్త ధరల పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారిగా గృహ వాడుక సహజ వాయు ధర గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉంది. గత రెండు సంవత్సరాల్లో పెరిగిన క్రూడాయిల్ ధరల వల్ల ప్రతి నెలా గరిష్ట ధరే అమలులో ఉండేది.
మే నెలలో భారత క్రూడాయిల్ బాస్కెట్ సగటు ధర బ్యారెల్కు $64.05గా ఉంది. ఇది ఏప్రిల్లో $67.73తో పోలిస్తే తక్కువ. ఇంకా, క్రూడాయిల్ ధరలు తగ్గడంతో నగర గ్యాస్ సంస్థలకు సరఫరా అయ్యే “న్యూ వెల్ గ్యాస్” ఖర్చు కూడా తగ్గనుంది. ఇది క్రూడాయిల్ ధరలో 12% ఆధారంగా నిర్ణయించబడుతుంది. గ్యాస్ పంపిణీ సంస్థలకు ఇది ముఖ్యమైన ఇన్పుట్ ఖర్చుగా ఉంటుంది.