రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా , పశ్చిమబెంగాల్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు,
రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పాటుగా మరోక ద్రోణి కూడా విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు,
40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.