బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయగా.. ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. అయితే నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఊపందుకుంటున్నాయి.
ఉత్తరాంధ్ర కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి వేడి తగ్గి పరిసరాలు కూల్కూల్గా మారుతున్నాయి. ఈసారి రుతుపవనాలు ముందే వచ్చినప్పటికీ గత పది రోజులుగా మందగించడంతో వానల జాడ కానరాకుండా పోయింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నేటి నుంచి 4 రోజులపాటు తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, హైదర్నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదైంది. గరిష్టంగా అదిలాబాద్లో 33.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 20 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది.ఇక ఈ రోజు (జూన్ 12) ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. గురువారం గరిష్టంగా నల్లగొండలో 36 డిగ్రీలు, కనిష్టంగా మహబూబ్ నగర్లో 30.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.