ఐటీ దాడులపై దిల్ రాజు స్పందించారు. ఐటీ రైడ్స్ తానొక్కడిపైనే జరగడం లేదని అన్నారు. ఇండస్ట్రీలో చాలా మందిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. పుష్ప 2 చిత్రాన్ని నిర్మించిన మైత్రి సంస్థ నిర్మాతలు నవీన్, రవిశంకర్ పై కూడా రైడ్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజు అసలు పేరు వెలమకుచా వెంకట రమణ రెడ్డి. ఆయనకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్ కింద ఇప్పటివరకు 50కి పైగా హిట్ చిత్రాలు నిర్మించారు.
ఆయన నికర విలువ దాదాపు రూ. 2000 కోట్లుగా ఉందని సమాచారం. హైదరాబాద్ లో దిల్ రాజు కి చాలానే ప్రాపర్టీస్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో ఉన్న విలాసవంతమైన బంగ్లా, కొన్ని రిసార్ట్స్, విలాసవంతమైన కార్లు (BMW), నిజాం ఏరియాలో 40 థియేటర్లు దిల్ రాజు పేరు మీద ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఎనిమిది ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. వీటిలో జూబిలీ హిల్స్లోని ఆయన ఇల్లు, కార్యాలయం, కుటుంబ సభ్యుల ఆస్తులపై దాడులు నిర్వహించారు. దిల్ రాజుతో పాటు, ‘పుష్ప 2: ది రూల్’ వంటి బిగ్ ప్రాజెక్టులపై పని చేసిన నిర్మాతలు రవిశంకర్ మరియు నవీన్ యెర్నేని పై కూడా దాడులు జరిగాయి.
2003లో విడుదలైన ‘దిల్’ సినిమా ద్వారా ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’, ‘వారిసు’ వంటి హిట్ సినిమాలను నిర్మించారు. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నం’ భారీ రికార్డులు సాధించినప్పటికీ, ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేదు. 2017లో తన మొదటి భార్య అనితను కోల్పోయిన దిల్ రాజు, 2020లో తేజస్వినిని (వైఘ రెడ్డి) వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2022లో ఒక కుమారుడు కూడా ఉన్నాడు.