గత కొన్ని వారాలుగా ఆసియా అంతటా కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆసియాలోని రెండు అతిపెద్ద నగరాలైన హాంకాంగ్, సింగపూర్లలో భారీగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తు్న్నాయి. సింగపూర్లో ఈవారంలో 28శాతం కేసులు పెరిగాయి. అయితే తెలుగురాష్ట్రాల్ని కూడా ఎలర్ట్ చేసింది కొవిడ్ ఫియర్. పొరుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడంతో స్పెషల్ అడ్వైజరీ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ. వీలైనంతవరకు పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలకు దూరంగా ఉండాలి. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ల్లో మాస్క్ వేసుకోవడం భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.

60 ఏళ్లు పైబడిన వాళ్లు, గర్భవతులు ఇంట్లోంచి బైటికి రావద్దు. తరచూ చేతులు కడుక్కోవాలి, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అనారోగ్యంగా ఉంటే బైటకు వెళ్లకండి.. అని సూచించింది ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్. పరీక్షల కోసం ల్యాబ్స్ సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారుల్ని అప్రమత్తం చేసింది కూడా. ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర కోవిడ్ సంబంధిత సమస్యలతో ఇద్దరు మరణించారు. వీళ్లకు మిగతా అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో అప్పట్లో తేలిగ్గా తీసుకున్నాయి ప్రభుత్వాలు.
ఇప్పుడు కూడా మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే భారత్లో ఆందోళన పడాల్సిన పనే లేదు. ఎందుకంటే.. ఒక్క హాంకాంగ్లోనే 30మందికి పైగా చనిపోయారు. థాయ్లాండ్లో ఏప్రిల్ నుంచే కొవిడ్ టెర్రర్ ఉంది. ఒక్క బ్యాంకాక్లోనే ఆరువేల కేసులు నమోదయ్యాయి. మన దేశపు జనాభాతో పోలిస్తే ప్రస్తుతమున్న కేసుల సంఖ్య చాలా తక్కువ. అంతమాత్రాన కరోనా ఉనికి లేదని ఊపిరి పీల్చుకోడానికి లేదు. ఎందుకంటే.. టెస్టుల సంఖ్యను బట్టే కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. కొవిడ్ సంకేతాలు కనిపించగానే టెస్టుల కోసం క్యూ కట్టే పరిస్థితి ఇంకా మన దేశంలో లేదు. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న వైరస్.. ఒమిక్రాన్ ఫ్యామిలీలోని జేఎన్1 అనే వేరియంట్ నుంచి వచ్చిన సబ్వేరియంట్.

ఒరిజినల్ వైరస్తో పోలిస్తే, దీని తీవ్రత చాలాచాలా తక్కువ. థర్డ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంటే అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. తాజా వేరియంట్తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేనట్టే..! 100 మందికి వైరస్ సోకితే ఐదుగురు కూడా ఆస్పత్రిలో చేరే అవసరం రాదు. కానీ.. కొవిడ్ ఉనికి తీవ్రతను బట్టి దేశాలన్నీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నదీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్. అందుబాటులో ఉన్నంత మాత్రాన బూస్టర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా..? అనేది కొత్తగా పుట్టిన భయం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA.. కొవిడ్ వ్యాక్సిన్ రెగ్యులేషన్స్ని మార్చేసింది.
65 ఏళ్లు పైబడినవాళ్లు మాత్రమే బూస్టర్ షాట్స్ తీసుకోడానికి అర్హులని తేల్చింది. ఇంతకంటే భయపెట్టే విషయం ఏంటంటే.. వ్యాక్సినేషన్ తర్వాత గుండెసంబంధిత వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తోంది FDA. ఈ మేరకు లేబుల్ మీద వార్నింగ్ ఇవ్వాలని వ్యాక్సిన్ తయారీ కంపెనీలను ఆదేశించింది కూడా. సో.. బూస్టర్ వ్యాక్సిన్ వేసుకుందాం.. కొవిడ్ బారిన పడకుండా తప్పించుకుందాం అని ఆశపడితే గుండెపోటుకు దొరికిపొయే ఛాన్సు ఉంది. తస్మాత్ జాగ్రత్త..!