ప్రముఖ జానపద కళాకారుడు, ‘బలగం’ చిత్ర గాయకుడు పస్తం మొగిలయ్య (67) గత ఏడాది డిసెంబర్లో కన్నుమూసిన విషయం తెలిసిందే. వరంగల్కు చెందిన ఆయన కొంత కాలంగా మూత్ర పిండాల సంబంధ వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే బలగం సినిమాలో భాగమైన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. బలగం సినిమాలో కొమురయ్య పాత్రలో అద్భుతంగా నటించిన సుధాకర్ ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు.
అయితే ఇదే సినిమాలో కొముయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవీ బాబు మాత్రం అవకాశాల్లేక అనారోగ్యంతో మంచం పట్టాడు. ప్రస్తుతం ఆయన మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నారు. వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాబుకు చికిత్స అందిస్తున్నారు. అలాగే తరచూ డయాలసిస్ చేయిస్తున్నారు. అయితే వైద్యం చేయించడానికి, మందుల కొనుగోలుకు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాబు కుటుంబ సభ్యులు.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవీ బాబుకు మెరుగైన వైద్యం అందించాలని, దాతలు, కళాకారులు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు రావాలని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం కోరారు. కాగా బలగం సినిమాతో పేరు వచ్చినా కూడా ఆ పెద్దగా డబ్బు అలాగే అవకాశాలు రాలేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన బాబు రంగస్థల కళాకారుడు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో అంజన్నగా అద్భుతంగా నటించి ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించారు.
అయితే బలగం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు బాబు. దీంతో కుటుంబం ఆర్థిక సమస్యల బారిన పడింది. ఇప్పుడు బాబు కూడా అనారోగ్యంతో మంచాన పడ్డారు. ప్రభుత్వం, దాతలు సానుకూలంగా స్పందించి బాబుకు వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.