యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో కుందేళ్ళు, పావురాలు, హంసలను తలపించే తెల్లబాతులు, గిన్నెకోళ్ళు ఉన్నాయి. ఇవి పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి ఆహ్లాదాన్ని, వినోదాన్ని పంచుతున్నాయి. సమస్యలతో ఇక్కడికి వచ్చే వారు కూడా ఇక్కడే కాసేపు గడిపి.. మనస్సును శాంతపర్చుకొని వెళ్తున్నారని పోలీసులు చెబుతున్నారు. యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ నల్లమల అటవీప్రాంతానికి సమీపంలో ఉంటుంది.
ఇక్కడ 2014లో ఎస్ఐగా పనిచేసిన మాతంగి శ్రీనివాసరావు పక్షి ప్రేమికుడు కావడంతో అటవీ వాతావరణంలో పోలీస్ స్టేషన్లోనే చిన్న పార్క్ ఏర్పాటు చేయాలని భావించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో బెంగళూరు నుంచి వివిధ రకాల పక్షిజాతులను తెప్పించారు.స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందిస్తూనే, మొక్కలు మధ్యలో పక్షులు, కుందేళ్ళ కోసం ఓ షెడ్డు, బాతుల కోసం చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత వచ్చిన అధికారులు సైతం దీన్ని అలాగే కంటిన్యూ చేశారు. దీంతో తొలుత కొద్దిసంఖ్యలో ఉన్న కుందేళ్ళు, పక్షుల సంతతి నానాటికి పెరిగి ఇప్పుడు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఓ ” చిడియా ఘర్ ” అన్నట్టుగా మారిపోయింది. స్టేషన్ సిబ్బంది అక్కడున్న పక్షులు, జంతువులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా పక్షులు, జంతువుల సంరక్షణ కోసం కొంత సమయం వెచ్చిస్తామని ప్రస్తుతం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చౌడయ్య చెబుతున్నారు.
రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వీటికి ఎవరో ఒకరు ఆహారం అందచేస్తున్నామని.. వీటి సంరక్షణ బాధ్యతను ఓ హోంగార్డుకు అప్పగించినట్టు తెలిపారు. కూరగాయల మార్కెట్ నుంచి ప్రత్యేకంగా క్యాబేజీ, కూరగాయాలు, ఆకుకూరలు తెప్పించి వీటికి ఆహారంగా పెడుతున్నారు. పక్షులకు గింజలను అందుబాటులో ఉంచుతూ.. వాటి నిర్వహణ బాధ్యతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కు వచ్చే ఉన్నతాధికారులు సైతం వీటిని చూసి సిబ్బంది ప్రయత్నాన్ని అభినందించారు.
