కాంచన అసలు పేరు వసుంధర దేవి. ఆమె 1939లో చెన్నైలో జన్మించారు. మొదట ఆమె ఒక ఎయిర్ హోస్టెస్గా పని చేశారు. ఆ తర్వాత సినిమాలపట్ల ఆసక్తి పెరిగి నటిగా మారారు. ప్రముఖ దర్శకుడు ఆమెకు తొలి అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా వల్ల ఆమెకు మంచి పేరు వచ్చింది. అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కాంచన, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయారు. అయితే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె వందల కోట్ల ఆస్తులు కూడ బెట్టారు.
అయితే అవన్నీ త్రుణ ప్రాయంగా తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చేశారు.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఆమెకున్న అచంచలమైన భక్తే ఇందుకు కారణం. ఆ స్వామి సేవ కోసమే ఆమె పెళ్లి కూడా చేసుకోకుండా ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నారు. 1960, 70లలో టాప్ హీరోయిన్గా వెలుగొంది ఇప్పటికీ సినిమాల్లో మెరుస్తోన్న ఆ నటి పేరు కాంచన. నేటి తరానికి ఈ దిగ్గజ నటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు.
కానీ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ అమ్మమ్మ అంటే చాలా మంది గుర్తు పడతారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న స్పిరిట్ మూవీలోనూ కాంచన నటిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే కాంచన, ఆమె సోదరి గిరిజా పాండేలకు చెన్నైలోని టీ నగర్, జీఎన్ చెట్టి రోడ్డులో కోట్ల విలువైన స్థలం వారసత్వంగా వచ్చింది. అయితే కొందరు బంధువులు ఆ ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో కాంచన కోర్టు మెట్లెక్కారు. తన వారసత్వ ఆస్తి కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు.
ఈ క్రమంలోనే తన ఆస్తి దక్కితే దేవుడికే ఇస్తానని మొక్కుకున్నారు. అంతే.. కోర్టులో గెలిచిన వెంటనే తన మాటను నిలబెట్టుకుంటూ ఆ స్థలాన్ని స్వామివారికి రాసిచ్చేశారు. అక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల ఆలయ నిర్మాణం కోసం ఈ ఆస్తిని టీటీడీకి అప్పగించారు కాంచన. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ రూ. 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉంటుందని ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కాంచన.
