సౌందర్య మరణం అత్యంత విషాదకరం. ఆమె హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 2004 ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లి వస్తూ ఆమె ఏప్రిల్ 17న ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో తన సోదరుడిని కూడా కోల్పోయింది సౌందర్య. ఆమె మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు, యావత్ భారతీయ సినిమాకి తీరని లోటుగా చెప్పొచ్చు.
అయితే టాలీవుడ్లో అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించిన సౌందర్య తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్నారు. సౌందర్య తెలుగులో చివరగా శివ శంకర్ అనే చిత్రంలో నటించారు. ఇందులో మోహన్ బాబు హీరో. దీనికి కాపుగంటి రాజేంద్ర దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సౌందర్య పర్మిషన్ తీసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లింది. వెళ్లి వస్తూ ఈ ప్రమాదానికి గురయ్యింది.

మోహన్ బాబు కారణంగానే సౌందర్య మనకు లేకుండా పోయిందని సంచలన కామెంట్ చేశారు దర్శకుడు రాజేంద్ర. ఆయన చేసిన మిస్టేక్ సౌందర్య కొంప ముంచిందన్నారు. శివ శంకర్ సినిమాకి నిర్మాత మోహన్ బాబు. ఆయన సౌందర్యకి పర్మిషన్ ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఆమె మన ముందు బతికి ఉండేదని తెలిపారు. `షూటింగ్ సమయంలో నిర్మాత మోహన్బాబు ఎవరికీ సెలవిచ్చేవారు కాదు. ఎన్నికల ప్రచారం ఉండటంతో సౌందర్యకి మాత్రం సెలవిచ్చారు.
ఒకవేళ ఆయన అనుమతి నిరాకరించి ఉంటే ఆమె బతికేవారేమో. సౌందర్య మరణం కారణంగా సినిమా సరిగా తీయక పరాజయం చెందింది` అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజేంద్ర. ఆయన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. సౌందర్య మరణం ఆమె కుటుంబానికి, అభిమానులకు ఈ విషాదం ఎప్పటికీ తీరనిది. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, ఒక అసాధారణ వ్యక్తిత్వం. ఆమె జ్ఞాపకాలు సినీ ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
