మద్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల్ని తగ్గించిన సర్కార్ ఆ తర్వాత ధరల్ని భారీగా పెంచేసింది. ఇప్పుడు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపనున్నారు. అయితే కాలం చెల్లిన మద్యం విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం మద్యం దుకాణాలపై ఆరోపణలు వచ్చిన ఘటన యానాంలో వెలుగు చూసింది.
ఆయా దుకాణాలు కాలం చెల్లిన బీర్లను విక్రయించినట్టు గుర్తించిన కొందరు కస్టమర్లు.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఆయా దుకారణాల్లో తనిఖీలు నిర్వహించారు. తాజాగా జరిగిన తనిఖీలలో, ఒక ప్రభుత్వ మద్యం షాపులో ఇప్పటికే నాలుగు కేసుల కాలం చెల్లిన బీర్లను వినియోగదారులకు విక్రయించినట్లు గుర్తించారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు, రెవెన్యూ అధికారి సెంధిల్ కుమార్ షాపులో ఉన్న మరో మూడు కేసుల కాలం చెల్లిన బీర్లను స్వాధీనం చేసుకున్నారు. కాలం చెల్లిన మద్యం విక్రయంతో పాటు, యానాంలోని ప్రభుత్వ, ప్రైవేటు మద్యం షాపులలో అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ప్రతి సీసాపై అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్నారని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పుదుచ్చేరి ప్రభుత్వ దుకాణాల్లోనే ఇంత మొత్తంలో ఎక్స్పైరీ అయిన మందు అమ్ముతుంటే, ప్రైవేట్ షాపులలో ఇంకా ఎంత మద్యం నిల్వ ఉందో ఆ దేవుడికే ఎరుక అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్య ధోరణే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ప్రతినెల మద్యం స్టాకు నిల్వ ఎంత ఉందో తనిఖీ చేయకుండా కాలయాపన చేయడం వల్లే వినియోగదారులు ప్రాణాలకు ప్రమాదకరమైన మద్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ, ప్రైవేటు మద్యం దుకాణాలలో ఉన్న స్టాకును తనిఖీ చేయాలని, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
