ముజఫర్ నగర్లోని నాయి మండి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గాంధీ కాలనీలో నవంబర్ 4న ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో అతడికి చలానా జారీ అయింది. హెల్మెట్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడికి జరిమానా విధించారు. అయితే చలానా కాపీని చూసి ఆశ్చర్యపోవడం అతడి వంతైంది.
అయితే ఈ సంఘటన నవంబర్ 4న నాయి మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ కాలనీ చెక్పాయింట్ వద్ద జరిగింది. స్కూటర్ రైడర్ అన్మోల్ సింఘాల్కు హెల్మెట్ పెట్టుకొని కారణంగా, సరైన డ్రైవింగ్ లైసెన్స్ చూపించనందు వల్ల ఫస్ట్ చలానా పడింది. ఇక అది కాస్తా రూ. 20.74 లక్షల చలానా అని తన నెంబర్కు మెసేజ్ వచ్చింది. ఇక ఆ చలానా విధించడమే కాదు.. స్కూటర్ను సైతం స్వాధీనం చేసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు.

వెయ్యి.. రెండు వేలు అయితే జరిమానా ఎవరైనా కట్టేస్తారు. అయితే అతడికి పడిన రూ. 20.74 లక్షల చలానా చూసి మాత్రం దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది. పోలీసుల వరకు విషయం కూడా వెళ్ళడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. భారీ జరిమానా ఓ టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిందని కనుగొన్నారు. అధికారుల ప్రకారం, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద కేసు నమోదు చేయాల్సి ఉంది.
ఇది పోలీసులకు కొన్ని సందర్భాల్లో వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే చలానా జారీ చేసిన సబ్-ఇన్స్పెక్టర్ పొరపాటున కేసు దగ్గర ‘207’ సంఖ్యను రాయాల్సింది పోయి.. ఆ నెంబర్ పొరపాటున జరిమానా మొత్తానికి జోడించారు. దానితోనే రూ. 4 వేలు కాస్తా రూ. 20,74,000కు పెరిగింది. వెంటనే ఈ లోపాన్ని సరిదిద్ది స్కూటర్ యజమాని చెల్లించాల్సిన అసలు జరిమానా రూ. 4,000 అని స్పష్టం చేశారు.
