దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి ఇండస్ట్రీలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ తన జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కోంది. ఆమె మరెవరో కాదు.. నటి డిస్కో శాంతి. అయితే సినిమా కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఓ టాలీవుడ్ ఫేమస్ నటుడిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎంతో సరదాగా సాగిపోతోన్న ఈ అందాల తార జీవితం కొన్నేళ్ల క్రితం ఒక్కసారిగా పెను కుదుపునకు గురైంది. స్టార్ నటుడిగా వెలుగొందుతోన్న ఆమె భర్త హఠాత్తుగా కన్నుమూశారు.
దీంతో ఈ నటి తల్లడిల్లిపోయింది. భర్త మరణం నుంచి కొన్నేళ్ల పాటు తేరుకోలేకపోయిందీ అందాల తార. ఒకానొక సమయంలో భర్తను మర్చిపోలేక తాగుడుకు కూడా బానిస అయ్యిందని ప్రచారం జరిగింది. అయితే తన బిడ్డలకు బంగారు భవిష్యత్ ను అందించేందుకు మళ్లీ మాములు మనిషిగా మారిపోయింది. అనకున్నట్లే తన కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కానీ తన భర్త పంచిన ప్రేమను మాత్రం మర్చిపోలేకుంది.

అందుకే అతను చనిపోయి పుష్కర కాలం గడుస్తున్నాభర్త కట్టిన తాళి బొట్టును మెడలో అలాగే ఉంచుకుంది. దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి. ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైన డిస్కో శాంతి మెడలో మంగళసూత్రాలతో కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తన తాళిబొట్టును చూపిస్తూ.. ‘ఇది నా బావ తన ప్రేమకు గుర్తుగా నాకు కట్టింది. ఆయన ప్రస్తుతం నా తో లేకపోయినా, కట్టిన తాళి నా మెడలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మంగళసూత్రం అలాగే వేసుకున్నాను.
బావ తన మెడలో వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా వేసుకుంటారు దానిని కూడా నేను మంగళ సూత్రంలోనే వేసుకున్నాను. ఈ తాళిబొట్టును మా బావ ప్రేమకు గుర్తుగా ఉన్నించుకున్నాను. ఎవరైనా దీనిపైన చేయి వేస్తే చంపేస్తాను’ అని చెప్పుకొచ్చింది డిస్కో శాంతి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భర్తపై తనకున్న ప్రేమను డిస్కో శాంతి ఇలా చూపిస్తుందంటూ నెటిజన్లు నటిని మెచ్చుకుంటున్నారు.