విశాఖపట్నంలోని జ్ఞానాపురం, సిరిల్ వీధిలో నివాసముంటున్న ఆగ్నేసమ్మ గతంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా సేవలు అందించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, జీవితాన్ని మార్చే మార్గం చూపిన ఆమెకు స్థానికంగా మంచి పేరు ఉంది. విద్యారంగంలో ఆమె సేవలు చిరస్మరణీయం రిటైర్ అయినా.. విద్య పట్ల ఆమె అంకితభావం తగ్గలేదు. అనేకమంది పిల్లల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన ఆగ్నేసమ్మ, నిజమైన గురువు అనే పేరు తెచ్చుకున్నారు.
నేటి తరానికి ఆమె సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. పూర్తీ వివరాలోకి వెళ్తే.. యువ కథానాయకుడు సందీప్ కిషన్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన నానమ్మ శ్రీపాదం ఆగ్నేసమ్మ (88) విశాఖపట్నంలో సోమవారంనాడు కన్నుమూశారు. జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన ఆగ్నేసమ్మ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె విశాఖలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.

నిన్న విశాఖపట్నంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రిలో ఆగ్నేసమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్ పాల్గొని తన నానమ్మకు నివాళులర్పించారు. అనంతరం, సందీప్ కిషన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు. “నిన్న మేము మా నానమ్మను కోల్పోయాము. మా తాతయ్య కృష్ణం నాయుడు షిప్ ఆర్కిటెక్ట్ అయితే, నానమ్మ ఆగ్నెస్ వైజాగ్లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు.
1960ల నాటి వారి మతాంతర ప్రేమ ఓ సినిమా కథలాంటిది. పెళ్లి తర్వాత తాతయ్య జోసెఫ్ కృష్ణం నాయుడుగా, నానమ్మ ఆగ్నెస్ లక్ష్మిగా మారారు. నాకు తెలిసిన అతి గొప్ప ప్రేమకథ వాళ్లది. మిస్ యూ నానమ్మ.. లవ్ యూ” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పలువురు ఆయనకు ధైర్యం చెబుతున్నారు.