వాతావరణ శాఖ హెచ్చరికలు, ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..?

divyaamedia@gmail.com
2 Min Read

జూన్ నెలలో వారం రోజులుగా మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళ మండేఎండలతోపాటు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో రుతుపవనాలు వేగం పుంజుకోవడంతో పాటు.. వాయువ బంగాళాఖాతం, ఆనుకొని ఉన్న ఉత్తర తీర ఒడిశా, దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్‌ వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం అత్యధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 9 సెంటీమీటర్లు కురిసింది.

అయితే, మంగళ, బుధవారాల్లోనూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అదేవిధంగా.. బుధ, గురు, శుక్రవారాల్లోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కొనసాగుతాయని వివరించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 9 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. సదాశివనగర్ లో 8సెం.మీ, జుక్కల్ లో 7సెంమీ వర్షపాతం, కామారెడ్డిలో 7 సెం.మీ, బిర్కూర్ లో 6 సెం.మీ, నిజామాబాద్ జిల్లా బోధన్ లో 6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *