ప్రభుత్వ కథనం ప్రకారం, ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకలను డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వహించగా, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చింది. జరిగిన దుర్ఘటన నేపథ్యంలో, బెంగళూరు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో సెక్షన్ 105 కూడా ఉంది. ఇది నేరపూరిత నరహత్యకు సంబంధించినది. అయితే ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఏజీని ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో కార్యక్రమం నిర్వహించిన ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేన్లపై బీఎన్ఎస్లోని 5 సెక్షన్ల కింద కర్ణాటక పోలీసులు కేసు బుక్ చేశారు. దీన్ని సుమోటోగా స్వీకరించిన పోలీసులు.. ఈ మేరకు ఆర్సీబీ, కేఎస్సీఏలపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం నియమించిన జిల్లా మేజిస్ట్రేట్ జి జగదీశ.. KSCA, RCB ఫ్రాంచైజీలకు నేడు (జూన్ 5) నోటీసులు పంపనున్నారు. విచారణ జరిపి నివేదికను 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లు విశ్లేషిస్తామని, ఇందులో భాగంగా మరణించిన, గాయపడిన వారి కుటుంబాల వాంగ్మూలాలను సేకరిస్తామని జిల్లా మేజిస్ట్రేట్ జగదీశ చెప్పారు. జూన్ 13న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సాధారణ ప్రజలు కూడా తమ వాంగ్మూలాలు ఇవ్వవచ్చని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఆర్సీబీ IPL విజయోత్సవ వేడుకల సందర్భంగా మోహరించిన పోలీసుల జాబితాను సైతం తయారు చేసి, వారి వాంగ్మూలాలు కోరతామని ఆయన తెలిపారు. ఆర్సీబీ జట్టును బెంగళూరు తీసుకురావాలని మేం కోరలేదు.. కర్ణాటక హోంమంత్రి.
మరోవైపు విజయోత్సవాలకు ఆటగాళ్లను బెంగళూరుకు తీసుకురావాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం కాదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర అన్నారు. ఈ విషయంలో మేము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకిగానీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు ఎటువంటి అభ్యర్థన చేయలేదన్నారు. వారే విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని మంత్రి పరమేశ్వర తెలిపారు. వేడుకల కోసం RCB జట్టును KSCA బెంగళూరుకు తీసుకువచ్చినట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర మీడియాకు తెలిపారు. ఈ కేసును సమగ్ర దర్యాప్తు కోసం CIDకి అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు.