పెళ్లి కాకముందే కొంత మంది హీరోయిన్లు అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇలా ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకుంది. అంతకు మందు రవీనా టాండన్, విశ్వ సుందరి సుస్మితా సేన్ కూడా ఇలాగే పెళ్లికి ముందే అనాథ పిల్లలను దత్తత తీసుకుని వార్తల్లో నిలిచారు. అయితే ఇదే జాబితాలో చాలా మందికి తెలియని ఒక హీరోయిన్ పేరు కూడా ఉంది.
ఆమె ఒకరు కాదు.. ప్రీతి జింటా, అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్ఎనఫ్ను వివాహం చేసుకున్న తర్వాత లాస్ ఏంజిల్స్లో స్థిరపడిన సంగతి తెలిసిందే. 2021 నవంబర్లో సరోగసీ ద్వారా జై, జియా అనే కవలలకు ఆమె తల్లి అయ్యారు. అయితే, అంతకు చాలా సంవత్సరాల ముందే ఆమె 34 మంది ఆడపిల్లల బాధ్యతను స్వీకరించారు. వారి చదువు, ఆహారం, దుస్తులు వంటి అన్ని అవసరాలను తానే చూసుకుంటున్నట్లు ప్రీతి గతంలో వెల్లడించారు.

“నేను 34 మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నాను. వారి చదువు నుంచి ఆహారం, దుస్తుల వరకు అన్నీ నేనే చూసుకుంటాను. ఆ పిల్లలందరి ఉత్సాహభరితమైన మాటలు వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలియదు. వారంతా ఇప్పుడు నా పిల్లలు, నా బాధ్యత. వారితో నిరంతరం టచ్లో ఉంటాను, సంవత్సరానికి రెండుసార్లు వారిని కలుస్తాను” అని ప్రీతి జింటా ఒక సందర్భంలో తెలిపారు.
సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలు, ముఖ్యంగా ఆడ శిశువుల భ్రూణహత్యలు, అనారోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతున్న పిల్లల గురించిన కథనాలు తనను తీవ్రంగా కలచివేశాయని ప్రీతి పేర్కొన్నారు. ఈ ఆవేదనే తనను ఈ దిశగా అడుగులు వేయించిందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరింత మంది పిల్లలను దత్తత తీసుకోవాలనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.