శుభకార్యాలకు బంగారం కొనాలనుకున్న వారు షాపులకు ఎగబడ్డారు. మరికొంతమంది మాత్రం బంగారం ఇంకా కొంచెం తగ్గితే తీసుకుందామని అనుకున్నారు. అయితే, ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది షాకింగ్ విషయమే..! అయితే భారతదేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,000 కంటే తక్కువగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్నందున కొనుగోలుదారులకు ఇది మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు పాజిటివ్గా ఉండటం, ఆయా దేశాల స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో గోల్డ్ ప్రైస్ పడుతోంది.
ముఖ్యంగా అమెరికా- చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి, అమెరికా- ఇరాన్ అణు చర్చలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఉద్రిక్తతలు తగ్గడం వంటివి స్టాక్ మార్కెట్లకు జోష్ తీసుకొచ్చాయి. దీంతో పెట్టుబడుదారులు ఎక్కువ లాభాల కోసం స్టాక్మార్కెట్పై ఆసక్తి చూపుతున్నారు. బంగారం తగ్గినా, వెండి ధరలు కిలో రూ.96,900 వద్ద స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుత బంగారం, వెండి ధరలు.. ముంబైలో 2025 మే 16న శుక్రవారం ఉదయం నాటికి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.86,140 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం అయితే 10 గ్రాములు రూ.93,870 పలికింది.

వెండి ధర కిలో రూ.96,900 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..? ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)కి చెందిన అక్ష కాంబోజ్ ‘మీడియా’తో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఈ నెలలో కనిష్ట స్థాయికి చేరుకున్నాయని అన్నారు. గతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో గోల్డ్ భారీగా పెరిగింది. ఇప్పుడు అమెరికా- చైనా టారిఫ్ల యుద్ధం సద్దుమణిగింది. రష్యా- ఉక్రెయిన్ కూడా చర్చలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ కారణాలతో భారతదేశంలో బంగారం ధరలు తగ్గాయి.
ముఖ్యంగా వివాహాలు లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొనాలనుకునే వారికి ఈ ధర తగ్గుదల శుభవార్త అని కాంబోజ్ అన్నారు. అయితే యూఎస్ బాండ్ ఈల్డ్స్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై అంచనాలు తగ్గడం వంటివి సమీప భవిష్యత్తులో బంగారం ధరను మరింత తగ్గించవచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు. సురక్షితమైన ఎంపికగా బంగారం.. ధర తగ్గినప్పటికీ, బంగారం ఇప్పటికీ నమ్మదగిన పెట్టుబడి అని కాంబోజ్ నొక్కిచెప్పారు. ‘ప్రపంచ ఉద్రిక్తతలు, కరెన్సీ మార్పుల కాలంలో బంగారం సురక్షితమైన ఆస్తిగా మిగిలిపోయింది. ఇది ఫైనాన్షియల్ వ్యాల్యూ, ఎమోషనల్ ఇంపార్టెన్స్ రెండూ కలిగి ఉంది.

ఇది మీ భవిష్యత్తును భద్రపరచడానికి గొప్ప మార్గంగా మారుతుంది’ అని వివరించారు. షార్ట్ టర్మ్ ప్రైస్ డ్రాప్ కూడా ‘సేఫ్ హెవెన్’గా భావించే గోల్డ్ని ఆకర్షణీయంగా చేస్తుందని, ఇన్వెస్ట్ చేయడం తెలివైన పనని పేర్కొన్నారు. బంగారం, వెండి మార్కెట్ ట్రెండ్.. బంగారం, వెండి ధరలు ఇటీవల వోలటైల్గా ఉన్నాయని మెహతా ఈక్విటీస్కి చెందిన రాహుల్ కలాంత్రి వివరించారు. మిక్స్డ్ యూఎస్ ఫైనాన్షియల్ డేటా, యూఎస్ డాలర్ ఇండెక్స్లో స్వల్ప తగ్గుదల 0.29% పడిపోయి 100.59కి చేరుకోవడంతో బంగారం ఔన్సుకు $3,140 (సుమారు రూ.92,000) కనిష్ట స్థాయిని టచ్ చేసింది.
ఆ తర్వాత కోలుకుంది. యూఎస్ ఎకానమిక్ రిపోర్ట్స్, స్ట్రాంగ్ రిటైల్ సేల్స్ సహాయంతో వెండి కూడా తిరిగి పుంజుకుంది. భారత మార్కెట్లో గోల్డ్ సపోర్ట్ లెవల్ రూ.92,850– 92,480 మధ్య, రెసిస్టెన్స్ లెవల్ రూ.93,650– 93,890 మధ్య ఉండవచ్చని అంచనా. అలానే వెండి సపోర్ట్ లెవల్ రూ.95,080– 94,450గా, రెసిస్టెన్స్ లెవల్ రూ.96,650–97,250గా ఉంది.