తెలంగాణలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రక్రియ కావడంతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని సరిగా చెయ్యలేకపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, వెంటనే దీన్ని సరిచేయలేకపోయింది. దాదాపు ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల తర్వాత దీని పరిశీలించి.. ఓ క్రమ పద్ధతిలో మార్పులు చేస్తూ వస్తోంది. ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు స్వాగతిస్తారు.
అయితే పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్ల చేరికకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో దాదాపు 20 శాతం మేర పరిష్కరించింది. అయితే మిగతా దరఖాస్తులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల్లోనే పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం గ్రేటర్ పరిధిలోని మూడు లక్షలపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
అయితే గత ప్రభుత్వం నాటి నుంచే రేషన్కార్డులలో కొందరి సభ్యుల పేర్లు తొలగింపు కొనసాగుతున్నప్పటికి.. కొత్త సభ్యుల చేరిక ప్రక్రియ మాత్రం అందుబాటులో లేకుండాపోయింది. దీంతో పాటు ఉమ్మడి కుటుంబాలు రెండుగా విడిపోవడం, వివహారాలు జరగడంతో కుటుంబాల్లోకి కొత్త సభ్యులు చేరడం వంటి వాటితో ఈ సంఖ్య మరింత పెరిగిపోయింది.