ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా సంతకం చేసిన రూ.50 నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ బుధవారం వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లోఉన్న రూ.50 నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అయితే ఈ క్రమంలో మహాత్మా గాంధీ సిరీస్ లో కొత్త రూ.50 నోటును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది ఆర్బీఐ. ఇప్పుడున్న నోట్లపై మాజీ గవర్నర్ సంతకం ముద్రించి ఉంది. కొత్త నోట్లపై ప్రస్తుతం గవర్నర్ సంతకంతో వీటిని విడుదల చేసేందుకు సిద్ధమైంది.
కొత్తగా ప్రింట్ చేయనున్న రూ. 50 నోటు మహాత్మా గాంధీ సిరీస్ లో భాగంగానే డిజైన్ ఉండనుంది అని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. అదే విధంగా పాత నోట్ల విషయంలోనూ కీలక ప్రకటన చేసింది. కొత్త నోట్లు రానున్న వేళ పాత 50 రూపాయల నోటును వెనక్కి తీసుకుంటారా? అనే విషయంపైనా స్పష్టత ఇచ్చింది. పాత నోట్ల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త నోట్లు విడుదల చేసినప్పటకీ ప్రస్తుతం ఉన్న నోట్లు కూడా మార్కెట్లో చెలామణీలోనే ఉంటాయని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు చెక్ పెట్టేలా ఆర్బీఐ పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఆర్బీఐ అందించిన సమాచారం ప్రకారం కొత్త యాబై రూపాయల నోటు మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ లోనే విడుదల చేయనున్నారు. దీనిని ఫ్లోర్ సెంట్ నీలం రంగులో డిజైన్ చేయనున్నట్టు తెలుస్తోంది. నోటు వెనుక భాగంలో రథంతోఉన్న హంపి చిత్రంతో దేశ సాంస్కఈతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఈ నోటు పరిమాణం 66 మి.మీ x 135 మి.మీ ఉండనుందట.
మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రాను 2022లో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్ గా నామినేట్ చేసింది. ఆయన గతంలో ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కు చెందిన సంజయ్ మల్హోత్రా సీనియర్ అధికారిగా ఉన్నారు. కొంతకాలం పాటు ఇంధన మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి బాధ్యతల్లో కూడా పనిచేశారు.
ఆర్బీఐ గవర్నర్గా నియమితులైన తర్వాత తన మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో.. 6.5 శాతం నుండి 6.25 శాతానికి 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపును మల్హోత్రా ప్రకటించారు. 12 పాలసీల తర్వాత ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును తగ్గించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.