కేంద్ర ప్రభుత్వం కొత్త “నగదు రహిత చికిత్స” పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద, రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి ఏడు రోజుల చికిత్స కోసం రూ. 1.5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ప్రమాదం గురించి 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇస్తే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రమాదం జరిగినా… ఆయా ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులకు ఎలాంటి నగదు చెల్లించకుండానే… ఉచితంగా వైద్యం అందనుంది.
ప్రమాదం జరిగిన తర్వాత ఏడు రోజుల పాటు ఆయా ప్రమాదాల్లో గాయపడ్డ ప్రతి ఒక్కరికి రూ.1.5 లక్షల మేర వైద్య సేవలు అందనున్నాయి. ఆయా ప్రమాదాల్లో ఎంతమంది గాయపడ్డా… వారందరికీ ఇదే నిబంధనల మేరకు కేంద్రం నగదు రహిత వైద్యాన్ని అందించనుంది. ఇందుకోసం కేంద్రం ఓ ఐటీ ఆధారిత వేదికను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ఉపరిత రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు కానున్న అధారిటీ… ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేయనుంది.
వాస్తవానికి రోడ్డు ప్రమాదాల్లో అక్కడికక్కడే మరణించే వారిని పక్కనపెడితే… గాయపడ్డ వారికి సత్వర చికిత్సలు అందితే… రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గుతాయని నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో దృష్టి సారించిన కేంద్రం ఆయా జాతీయ రహదారుల వెంట ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయినా కూడా బాధితుల్లో చాలా మందికి సత్వర వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడం పెను సమస్యగా పరిణమించింది.
దీనిని అథిగమించేందుకే… కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైైద్యం అందించేందుకు సిద్ధమైంది. ఈ పథకం అమలులోకి వస్తే… రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం ఖాయమేనన్న వాాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కేంద్రం తీసుకువస్తున్న ఈ పథకం రోడ్డు రవాణాలో ఓ బృహత్తర పరివర్తనకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.