డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీకి మహిళలు వెళ్లకూడదని చేసిన మాధవీలత వ్యాఖ్యలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవీలత ఓ ప్రాస్టిట్యూట్ అంటూ చేసిన వ్యాఖ్యలపై మాధవీలత కూడా మండి పడ్డారు. ఈ వివాదం ఇలా నడుస్తున్న క్రమంలో మాధవీలత సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. అయితే తన ఆత్మగౌరవంపై దాడి జరిగిందంటూ భోరున ఏడ్చేసింది. ఈ క్రమంలో తన ఆవేదనకు గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా వివరించింది.
‘చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. ఇది నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి.. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరి వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్న.. నా పార్టీ ( ప్రజల) కోసం , మహిళల కోసం , హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను.
రూపాయి తీసుకున్నది లేదు ..ఎవరికి ద్రోహం చేసింది లేదు , మోసం చేసింది లేదు.. కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు.. ఆడపిల్లగా ఎపుడు నేను సింపతీ గేమ్ ఆడలేదు. మహిళలకు ఉన్నప్రత్యేక చట్టాలను ఉపయోగించింది లేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను . ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం , స్నేహితులు ఉన్న సరే నా అభిమానులు , సోషల్ మీడియా లో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు.. నా బాధని మీతో పంచుకున్నందుకు క్షమించండి..
మీ ప్రేమ అభిమానం , ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు మాధవీలత కాగా తనపై కామెంట్స్ చేసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పడంపై మాధవీలత స్పందించింది. నోటికొచ్చినట్లు తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మాధవీలత ఎమోషనలైంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.