‘ధనం మూలం ఇదం జగత్’ అనే సామెత ఉంది కదా.. ఈ రోజుల్లో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది. అయితే ఈ డబ్బు పిచ్చితో, సులభంగా సంపాదించాలనే ఆలోచనతో, కొందరు మోసగాళ్లు వృద్ధులు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని కలర్ జిరాక్స్ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల ఏపీలో ఓ హోల్సేల్ కూరగాయల వ్యాపారి దగ్గర ఓ వ్యక్తి రూ.250ల సరుకులు కొన్నాడు. ఆ తర్వాత వంద రూపాయల నోట్లు 3 ఇచ్చాడు. ఆ వ్యాపారి అవి తీసుకొని చిల్లర ఇచ్చేశాడు. ఆ తర్వాత కాసేపటికి.. వంద రూపాయల నోట్లలో ఒకటి కొద్దిగా తేడాగా కనిపించింది.
ఇదేంటి ఇలా ఉంది అని చెక్ చెయ్యగా.. అది నకిలీ నోటు అని ఆ వ్యాపారికి అర్థమైంది. వెంటనే దాన్ని చించేశాడు. అతను రూ.100 నష్టపోయాడు. సైలెంటుగా ఆ నోటును వేరేవారికి ఇచ్చేసి, వదిలించుకోవచ్చు. కానీ అతను ఆ తప్పు చెయ్యలేదు. తెలంగాణలో ఓ కిరాణా షాపులో సరుకులు కొన్న వ్యక్తి.. రెండు రూ.100 నోట్లు ఇచ్చాడు. ఆ తర్వాత హడావుడిగా అక్కడి నుంచి జారుకున్నాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యాపారి గమనిస్తే.. ఆ రెండు నోట్లూ.. నకిలీవి అని తేలింది. ఆ వ్యాపారికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

తాను నిజాయితీగా వ్యాపారం చేస్తుంటే.. తనకు ఇలాంటి నోట్లు వస్తుంటే, తానెందుకు నష్టపోవాలి అని ఆ వ్యాపారి ప్రశ్నించాడు. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అక్కడక్కడా కనిపిస్తున్న సీన్. రెండు రాష్ట్రాల్లో నకిలీ రూ.100 నోట్లు హల్చల్ చేస్తున్నాయి. ఇదివరకు దొంగ నోట్లు తయారుచెయ్యాలంటే చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు అంతా మారిపోయింది. సరికొత్త కలర్ ప్రింటర్లు వచ్చేశాయి. అవి అచ్చుగుద్దినట్లు సేమ్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాయి. అసలు ఏదో నకిలీ ఏదో కనిపెట్టలేని విధంగా నకిలీ నోట్లు ఉంటున్నాయి. వ్యాపారులు క్యాజువల్గా ఆ నోట్లను తీసేసుకుంటున్నారు.
ఎందుకంటే.. ప్రతీ నోటునూ క్షుణ్ణంగా పరిశీలించడం కష్టం. అంత టైమ్ ఉండదు. అలా.. ఈ నకిలీ నోట్లు చేతులు మారుతున్నాయి. వీటిని ఎవరు తయారుచేస్తున్నారో తెలియట్లేదు. కానీ రెండు రాష్ట్రాల్లో ఇవి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. రూ.500 నోట్లైతే.. తీసుకునేటప్పుడు వ్యాపారులు వాటిని గమనించే అవకాశం ఉంటుంది. అవి పెద్ద నోట్లు కాబట్టి.. వ్యాపారులు వాటిని పరిశీలనగా చూడగలుగుతున్నారు. అందువల్ల అక్రమార్కులు రూ.500 నోట్లను కాకుండా.. రూ.100 నోట్లను డూప్లికేట్ చేస్తున్నారు. ఇవైతే.. ఈజీగా చెలామణీ అవుతాయని వారు భావిస్తున్నారు.
ఏ వ్యాపారికైనా నకిలీ నోటు వస్తే, వారు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వట్లేదు. చించేస్తున్నారు. దీని వల్ల అక్రమార్కులు తప్పించుకుంటున్నారు. కొంతమందికి తమ దగ్గర దొంగ నోట్లు ఉన్నాయనే విషయం కూడా తెలియట్లేదు. వారు వాటిని సరుకులు కొనుక్కున్నప్పుడు ఇతరులకు క్యాజువల్గా ఇస్తున్నారు. అలా ఇచ్చేటప్పుడు వ్యాపారి గుర్తిస్తే.. “దొంగనోటా.. నిజమా… నాకు తెలియదు సారీ.. ఇది నా దగ్గరకు ఎలా వచ్చింది” అంటూ.. ఆలోచిస్తున్నారు. ఇలా.. వ్యాపారులూ, ప్రజలు కూడా ఈ నోట్లతో ఇబ్బందులు పడుతున్నారు.