Kappa Variant: కరోనాలో కొత్త రకం వైరస్​ - క‌ల‌క‌లం సృష్టిస్తున్న ‘కప్పా’ వేరియంట్

 Kappa Variant: కరోనాలో కొత్త రకం వైరస్​ -  క‌ల‌క‌లం సృష్టిస్తున్న ‘కప్పా’ వేరియంట్

గుజరాత్​లో కప్పా వేరియంట్​ కలకలం రేపింది. రాష్ట్రంలో ఒకేసారి ఐదు కేసులు బయటపడ్డాయి. జామ్​నగర్​లో 2, పాంచ్​మహల్​ జిల్లాలోని గోద్రాలో 2, మెహ్సానాలో ఒక కేసు వెలుగుచూసింది. కాగా, పాంచ్​మహల్​ వాసి మృతిచెందాడు. అతడికి డయాబెటిస్ కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు. గోద్రాలో కప్పా కేసు నమోదైన కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు సహా 50మంది నుంచి నమూనాలు సేకరించారు.

అతడితో సన్నిహితంగా ఉన్న 22 మంది ఆర్​టీపీసీఆర్​ శాంపిల్స్​ తీసుకున్నారు. దేశంలో సెకండ్ వేవ్ సందర్భంగా కరోనా డెల్టా వేరియంట్ అతలాకుతలం చేసింది. భారత్ లోనే కాదు అనేక దేశాల్లో ఇతర కరోనా వైరస్ రకాలతో పోల్చితే ఈ డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారిగా పరిణమించింది. అయితే, కరోనా వైరస్ ఎప్పటికప్పుడు జన్యు ఉత్పరివర్తనాలకు గురవుతూ కొత్త రూపం సంతరించుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లో రెండు కరోనా పాజిటివ్ కేసుల్లో కొత్త వేరియంట్ ను గుర్తించారు. దీన్ని కప్పా వేరియంట్ అని పిలుస్తున్నారు. ఇది త్వరగా వ్యాపించే లక్షణమున్న వేరియంట్ అని భావిస్తున్నారు. లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం కప్పా వేరియంట్ ను నిర్ధారించారు.

కరోనా కొత్త వేరియంట్ ను రాష్ట్రంలో గుర్తించడంపై అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సమాచారం అందించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ (ఆరోగ్యం) అమిత్ మోహన్ ప్రసాద్ స్పందిస్తూ, కప్పా వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, దీనికి చికిత్స అందుబాటులో ఉందని వివరించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి