ప్రేమించిన యువకుడిపై ప్రియురాలి దాడి...! DARSI LIVE NEWS

ప్రేమించిన యువకుడిపై ప్రియురాలి దాడి...! DARSI LIVE NEWS

చల్లపల్లి (కృష్ణా): ప్రేమించిన యువకుడిపై ప్రేమికురాలు దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు మచిలీపట్నం ఇంగ్లీషుపాలెం గ్రామానికి చెందిన యువతి మచిలీపట్నంలోని ఓ కళాశాలలో ఆమె పనిచేస్తోంది. గూడూరుకు చెందిన యువకుడు పెడన తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గత రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ ఇటీవల చల్లపల్లి మండలంలోని వక్కలగడ్డ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

సోమవారం ఆ ఇంటివద్ద యువకుడు కత్తిపోట్లుకు గురై ఉండటం, యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో స్థానికులు గుర్తించి  పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అపస్మారకస్థితిలో ఉన్న యువతిని అత్యవసర చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడు చల్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొన్నాళ్లుగా ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చిందని, తాను తిరస్కరిస్తూ వస్తున్నానని చెప్పాడు. చివరిసారిగా కలసి మాట్లాడుకుందామని పిలిస్తే సోమవారం ఉదయం వక్కలగడ్డకు వచ్చామని చెప్పాడు. పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలసి బతుకుదాం, లేకుంటే కలసి చనిపోదామని సాయంత్రం 4 గంటల సమయంలో తనపై కత్తితో దాడి చేసి ఆమె నిద్రమాత్రలు మింగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చల్లపల్లి సీఐ ఎన్‌.వెంకట నారాయణ, ఎస్సై పి.నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, అపస్మారక స్థితి నుంచి సదరు యువతి బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించిన అసలు విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి