తీరంలో చీలిక : భూకంపాలు, సునామీలకు అవకాశం - Andhra Pradesh - Darsi Live News

తీరంలో చీలిక : భూకంపాలు, సునామీలకు అవకాశం - Andhra Pradesh  - Darsi  Live News
తీరంలో చీలిక : భూకంపాలు, సునామీలకు అవకాశం - Andhra Pradesh  - Darsi  Live News

తూర్పుగోదావరి, శ్రీకాకుళం మధ్య గుర్తించిన శాస్త్రవేత్తలు

భవిష్యత్తులో భూకంపాలు, సునామీలకు అవకాశం

మనదేశ తూర్పుతీరానికి వంద కి.మీ. దూరంలో బంగాళాఖాతంలో 300 కి.మీ. పొడవున లోతైన చీలిక (ఫాల్ట్‌లైన్‌) ఉన్నట్లు సముద్ర అధ్యయన జాతీయ సంస్థ (ఎన్‌.ఐ.ఒ.), హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్నేళ్లుగా సాగుతున్న వారి పరిశోధనకు సంబంధించిన పత్రం తాజాగా ‘ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ ఆధ్వర్యంలో ‘జర్నల్‌ ఆఫ్‌ ఎర్త్‌ సిస్టం సైన్స్‌’లో ప్రచురితం కావడం సంచలనం రేపుతోంది. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీరం పొడవునా ఉన్న ఆ చీలిక ఎలా ఏర్పడింది? దాని పర్యవసానాలేమిటి? ముప్పును ఎలా ఎదుర్కోవచ్చనే అంశాలపై శాస్త్రవేత్తలు తదుపరి అధ్యయనం చేస్తున్నారు. ఎలా ఏర్పడి ఉండొచ్చంటే.... నదుల నుంచి సముద్రంలోకి నీటితోపాటు మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలు చేరుతుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలుగా జరిగే ఈ ప్రక్రియ వల్ల లక్షల టన్నుల అదనపు భారం సముద్ర గర్భంపై పడి ఒత్తిడి క్రమంగా పెరుగుతూ వచ్చింది. నదుల నుంచి కొట్టుకొచ్చిన రాళ్లు, మట్టి వల్ల సముద్రంలో 22 కి.మీ. ఎత్తున మేటలు పడ్డాయి. ఒత్తిడి పతాకస్థాయికి చేరాక భారాన్ని భరించలేక సముద్రగర్భంలో భూమి కంపించింది. ఆ ధాటికి సముద్రగర్భంలోని భూమి కొంతభాగం చీలిపోయింది. ఆ చీలిపోయిన భాగం లోతు 100 మీటర్ల నుంచి 900 మీటర్ల వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలుగుర్తించారు. గోదావరి ప్రాణహిత గ్రాబెన్‌ నుంచి నాగావళి వంశధార షియర్‌జోన్‌ వరకు సుమారు 300 కి.మీ. దూరం భూమి చీలినట్లు తేల్చారు. అందులోని రాళ్లు, మట్టి నమూనాల ఆధారంగా చీలిక 16 మిలియన్‌ సంవత్సరాల కిందటే ఏర్పడిందని గుర్తించారు. 6.8 మిలియన్‌ సంవత్సరాల నుంచి 0.3 మిలియన్‌ ఏళ్ల కిందటి వరకు ఆ చీలిక ప్రాంతంలో అలజడి కొనసాగుతూనే ఉందని తేల్చారు. ఆ మధ్యకాలంలో భూకంపాలు, సునామీలు వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. 0.3 మిలియన్‌ సంవత్సరాల నుంచి నేటి వరకు చీలిక వల్ల దుష్పరిణామాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించలేదు. చీలికలోకి చేరిన పూడికపై కొత్తగా వచ్చి చేరే మట్టి రాళ్లు, ఇసుక వల్ల క్రమంగా ఒత్తిడి పెరుగుతోందని, ఫలితంగా మళ్లీ భూకంపం వచ్చి అది సునామీకి దారితీయవచ్చునని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. విశాఖపై ప్రభావం.. సముద్రగర్భంలో చీలిక ఏర్పడినప్పుడు తీరం వైపు భూభాగం కుంగిపోయింది. అత్యధికంగా 900 మీటర్ల వరకు కుంగినట్లు ఆధారాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. విశాఖ తీరానికి సమీపంలో కుంగుబాటు ఎక్కువగా ఉందని, దాని పర్యవసానాలు నగరంపై పడే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రభావాలు ఎప్పుడైనా మొదలవ్వొచ్చు చీలిక కారణంగా భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి భూకంపాలు, సునామీల ముప్పు పొంచి ఉంది. అది ఎప్పుడన్నదీ చెప్పలేం. చీలిక భాగం తీరానికి వంద కి.మీ. దూరంలోనే ఉన్న నేపథ్యంలో ముప్పు తీవ్రత ఎక్కువని చెప్పకతప్పదు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఇస్మాయిల్‌, విశాఖ ఎన్‌.ఐ.ఒ.కు చెందిన డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, ఒ.ఎన్‌.జి.సి.కి చెందిన డాక్టర్‌ సాహా అధ్యయన బృందంలో ఉన్నారు. - డాక్టర్‌ కె.ఎస్‌.కృష్ణ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి